Kerala Model Arrest: ఆ మధ్య కర్ణాటకలో రన్యా రావు అనే ఓ నటి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయింది. తనకున్న సెలబ్రిటీ హోదా వాడుకుంటూ బంగారాన్ని అక్రమంగా దుబాయ్ ప్రాంతం నుంచి తీసుకురావడం మొదలుపెట్టింది. కొద్దిరోజులపాటు ఈ దందా సక్రమంగానే సాగింది. ఆ తర్వాత తనిఖీలలో అధికారులకు దొరికిపోయింది. జైలు శిక్ష కూడా అనుభవించింది. ఇటీవల కాలంలో బెయిల్ మీద బయటికి వచ్చింది. కేవలం ఈమె మాత్రమే కాదు. సెలబ్రిటీలలో చాలామంది ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు . ఇప్పుడు ఈ జాబితాలో కేరళం మోడల్ కూడా చేరిపోయింది. కాకపోతే ఆమె బంగారం స్మగ్లింగ్ చేయలేదు.. అంతకు మించిన వ్యవహారంలో పీకల లోతు మునిగిపోయింది.
ఆమె పేరు హర్షా సన్నీ. మోడల్ గా కొనసాగుతోంది. మిస్ కేరళం 2026 లో రెండవ స్థానంలో నిలిచింది. సెలబ్రిటీగా సమాజానికి రోల్ మోడల్ గా ఉండాల్సిన ఈమె దారి తప్పింది. మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేస్తూ దొరికిపోయింది. పైగా వాటిని తాగి మత్తులో ఉండిపోయింది. గురువారం రాత్రి బ్యాంకాక్ నుంచి ఆమె ముంబై విమానాశ్రయానికి వచ్చింది. ఆమె కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి. దీంతో అధికారులకు అనుమానం వచ్చింది. అధికారులను చూసిన ఆమె కంగారు పడింది. దీంతో వారిలో అనుమానాలు మరింత బలపడ్డాయి. వెంటనే ఆమె బ్యాగును పరిశీలించారు. అందులో ఏకంగా వ్యాక్యూమ్ సీల్ చేసి ఉన్న 11 కేజీల మత్తు పదార్థాలు బయటపడ్డాయి. వాటి విలువ ఏకంగా 11.8 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఆమెకు రిమాండ్ విధించారు.
కొంతకాలంగా హర్షా మత్తు పదార్థాల వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తోంది. వాటిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొస్తూ.. ఇక్కడ ఏకంగా వ్యాపారం మొదలు పెట్టినట్టు సమాచారం. ఖరీదైన నగరాలలో వీటిని ఆమె విక్రయిస్తోంది. ఈమె వెనక కొంతమంది సభ్యులు కూడా ఉన్నారు. ఈమె ద్వారా మత్తు పదార్థాలు తెప్పించి.. హై ప్రొఫైల్ వ్యక్తులకు వాటిని విక్రయిస్తున్నారు. ఇలా భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. వీరి వెనుక ఒక పెద్ద నెట్వర్క్ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు హర్ష మోడలింగ్లో ఉన్నప్పుడే మత్తు పదార్థాలకు బానిసగా మారినట్టు తెలుస్తోంది. అందువల్లే ఈ వ్యాపారం లోకి ఆమె ప్రవేశించినట్టు వార్తలు వినిపిస్తాయి. ఏకంగా 11 కిలోల మత్తు పదార్థాలను ఆమె అక్రమంగా తీసుకొస్తుంది అంటే.. ఆమె వెనుక ఎంతటి పెద్ద నెట్వర్క్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల విలువ 11.82 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు మాత్రమే ఈమె ఈ స్థాయిలో మత్తు పదార్థాలు తీసుకువచ్చిందా.. గతంలో కూడా ఇటువంటి వ్యవహారాలకు ఏమైనా పాల్పడిందా.. అనే కోణాలలో అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
సెలబ్రిటీ హోదాలో ఉండి సమాజానికి ఒక మార్గదర్శకమైన వ్యక్తి లాగా ఉండాల్సిన హర్ష ఇలా మత్తు పదార్థాలకు బానిస కావడం.. మత్తు పదార్థాలను రవాణా చేయడం పట్ల సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు కనిపిస్తున్నాయి. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి వారి వల్లే యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని ఆరోపిస్తున్నారు. రిమాండ్లో ఆమెను పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఆమె చెప్పే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.

