కేసీఆర్‌‌కే తలనొప్పి తెచ్చాయే!

‘ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడుతుంటారు’ అని సామెత. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ తీసుకున్న నిర్ణయం కూడా ఆయనకు అలాగే తయారైంది. రైతులు ఎవరి మానాన వారు తమకు నచ్చిన పంటలను వేసుకొని లాభాలు పొందుతుంటే.. కేసీఆర్‌‌ ఏమో సంప్రదాయ వ్యవసాయాన్ని పక్కనపెట్టి నిర్బంధ సాగుకు తెరలేపారు. మొక్కజొన్న సాగు చేయవద్దన్నారు. దొడ్డు వడ్లు సాగు వద్దన్నారు. తమను కాదని వాటిని పండిస్తే రైతుబంధు తదితర పథకాలు వర్తించవంటూ బెదిరించారు. మరిన్ని తెలంగాణ రాజకీయ […]

Written By: NARESH, Updated On : November 5, 2020 1:37 pm
Follow us on

‘ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడుతుంటారు’ అని సామెత. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ తీసుకున్న నిర్ణయం కూడా ఆయనకు అలాగే తయారైంది. రైతులు ఎవరి మానాన వారు తమకు నచ్చిన పంటలను వేసుకొని లాభాలు పొందుతుంటే.. కేసీఆర్‌‌ ఏమో సంప్రదాయ వ్యవసాయాన్ని పక్కనపెట్టి నిర్బంధ సాగుకు తెరలేపారు. మొక్కజొన్న సాగు చేయవద్దన్నారు. దొడ్డు వడ్లు సాగు వద్దన్నారు. తమను కాదని వాటిని పండిస్తే రైతుబంధు తదితర పథకాలు వర్తించవంటూ బెదిరించారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

ఏమీ చేయలేక రైతులు కూడా సన్నాలను సాగు చేశారు. కానీ.. ఇప్పుడు ఆ సన్నాలే సీఎం కేసీఆర్‌‌కు తలనొప్పిని తెచ్చిపెట్టాయి. నియంత్రిత సాగులో భాగంగా ప్రభుత్వం సూచించినట్లే రైతులు పంటలు వేశారని ఘనంగా ప్రకటించారు. ఈ నియంత్రిత విధానంలో భాగంగా పెద్ద ఎత్తున రైతులు సన్నబియ్యం రకాలను పండించారు. పంట చేతికి వచ్చింది. ఇప్పుడు వాటిని ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అయితే.. కొత్తగా రైతులు ప్రభుత్వం చెప్పినట్లే పండించినందున తమకు సన్నాల రకాలకు రూ.2,500 మద్దతు ధర ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. రాజకీయ పార్టీలు సైతం వీరికి మద్దతు తెలుపుతున్నాయి. పెద్ద ఎత్తున బియ్యం పండించిన రైతులు ఇప్పుడు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు.

Also Read: విజయశాంతికి అధిష్టానం బుజ్జగింపులు

సన్నాలు పండిస్తే ప్రోత్సాహం కూడా ప్రకటిస్తామని అప్పుడు కేసీఆర్‌‌ చెప్పారు. దీంతో రాష్ట్రంలో 85 నుంచి 90 శాతం సన్నవరి సాగైంది. సాధారణంగా దొడ్డు రకాల కన్నా సన్నాల సాగుకు ఎకరానికి రూ.7 వేల చొప్పున పెట్టుబడి ఎక్కువవుతుంది. గతంలో సన్నాలకు మిల్లర్లు క్వింటాకు రూ.రెండు వేలు ఇచ్చేవారు. ఇప్పుడు భారీగా దిగుబడి రావడంతో రూ.1500 కూడా ఇవ్వలేమన్నట్లుగా ఉన్నారు. దీంతో నిల్వలు ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. మరోవైపు.. సన్నాల సాగును ప్రోత్సహించిన ప్రభుత్వం మద్దతు ధర విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆగ్రహంతో ఉన్నారు.

Also Read: అమెరికా అధ్యక్షుడిగా ఎవరు గెలిస్తే భారత్‌కు మేలు?

ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.1,888 మద్దతు ధరను ప్రకటించింది. అది దొడ్డు బియ్యానికి ఇచ్చే మద్దతు ధరనే. అయితే పెట్టుబడి ఖర్చులు పెరిగినందునా ఇది సరిపోదని, రూ.2,500 ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. కేసీఆర్ చెప్పినట్లే పంటలు సాగు చేశామని.. ఇప్పుడు మద్దతు ధర ఇప్పించాల్సిన బాధ్యత కూడా సీఎంపై ఉందని అంటున్నారు. లేకపోతే ఉద్యమానికి సిద్ధమని చెబుతున్నారు. మరి సన్నాల విషయంలో చివరికి సీఎం ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.