KCR vs Media : మొన్నామధ్య బీబీసీ మీద ఐటీ దాడులు జరిగినప్పుడు ‘చూశారా మోడీ దేశంలో పాత్రికేయులపై ఎలా దాడులు చేస్తున్నాడో’ అని మొత్తుకుని, ట్విట్టర్, ఫేస్ బుక్లో నానా యాగీ చేసిన భారత రాష్ట్రసమితి నాయకులు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఏం చేస్తున్నారో మాత్రం చెప్పరు. తమకు బాకాలు ఊదని, బాజాలు మోగించని మీడియాను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో పెదవి విప్పరు. బయటకు ఎన్నో సుద్దులు చెబుతుంటారు కానీ.. వాళ్ల దృష్టిలో పేపర్ అంటే నమస్తే తెలంగాణ.. న్యూస్ చానెల్ అంటే టీ న్యూస్.. ఎందుకంటే ఉదయం లేస్తే వాళ్లకు అవి భజన చేస్తాయి కాబట్టి.. వాళ్ల వార్తలు తప్ప మిగతవారివి ప్రచురించవు కాబట్టి..
మొన్న ఈడీ కవితను విచారణకు పిలిచిన నేపథ్యంలో కేటీఆర్ అంతకుముందు రోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. ఈసందర్భగా వీ6 రిపోర్టర్ శివారెడ్డి కేటీఆర్ను ‘ లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయంలేనిదే మీరు నోటీసులు వచ్చాయని భావిస్తున్నారా’ అని ప్రశ్నించగా.. సహనం కోల్పోయిన కేటీఆర్.. ‘ఏం చానెల్ నీది వీ6 కదా.. మీ వెలుగు పేపర్లో గుజరాత్లో కల్తీ మద్యం తాగి 42 మంది చనిపోయారు. ఆ వార్త వేసినవా? గుజరాత్ డ్రై స్టేట్ కదా? అక్కడ మద్యం అమ్మవచ్చునా?’ అని నిలదీశాడు. కానీ భజనకు అలవాటు పడిన కేటీఆర్కు తెలియనది ఏమిటంటే.. ఆ వార్త వీ6 ప్రచురించింది. ప్రసారం చేసింది.
ఇప్పుడు తాజాగా అప్ డేట్ ఏంటంటే.. బీజేపీ నాయకుడు గడ్డం వివేక్ సొంత చానెల్, పత్రిక అయిన వీ6, వెలుగు దినపత్రికలో ఈ మధ్య కేసీఆర్ , బీఆర్ఎస్ వ్యతిరేక వార్తలు హోరెత్తుతున్నాయి. అందుకే తాజాగా అధికారికంగా కేసీఆర్, బీఆర్ఎస్ ఈ మీడియాపై నిషేధం విధించాడు. వీ6 పత్రిక, న్యూస్ చానెల్ ఈ రెండు మీడియా పోర్టల్లతో ఇంటరాక్ట్ కావద్దని కేసీఆర్ నేతృత్వంలోని పార్టీ తమ నేతలను ఆదేశించింది. సంబంధిత ఉత్తర్వులను బీఆర్ఎస్ ప్రతినిధులందరూ ఖచ్చితంగా అమలు చేయాలని కోరింది. దీనిపైనే జర్నలిస్ట్ వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
మీడియా గురించి, జర్నలిజం గురించి వీరలెవల్లో ప్రసంగాలు ఇచ్చే కేసీఆర్ అండ్ కో తమ కింద నలుపును మాత్రం చూసుకోలేరు. తమ భజన చేసే నమస్తే తెలంగాణ, టీ న్యూస్ లకు మాత్రం ప్రభుత్వ ప్రకటనలు దండిగా ఇస్తారు. పప్పూబెల్లాలు పంచినట్టు ప్రకటనలు ఇస్తారు. మిగతా పేపర్లకు మాత్రం మొండి చెయ్యి చూపిస్తారు. ఇదేంటని అడిగితే ఆంధ్రా మీడియా అంటూ నెపం వేస్తారు. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలకులు వీరి తీరునే వ్యవహరిస్తే ఆ భజన నమస్తే తెలంగాణ, టీ న్యూస్ మనుగడ సాగించేవా? అంతే కాదు తెలంగాణ ఏర్పాటయిన కొత్తలో వరంగల్ సభలో కేసీఆర్.. మీడియాను పది మీటర్ల లోతున పాతిపెడతా అని హెచ్చరించాడు. అంతే కాదు టీవీ9, ఏబీఎన్, టీవీ5 చానెల్ను నిషేదించాడు. వీటిలో టీవీ9, టీవీ5 సర్కారుతో సయోధ్య కుదుర్చుకోగా, ఏబీఎన్ మాత్రం న్యాయ పోరాటం చేసి కేసీఆర్పై గెలిచింది.