Karnataka Ex Speaker : ఈ దేశంలో నిమిషానికో మహిళ లైంగిక దాడికి గురవుతోంది. పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకూ విడిచిపెట్టట్లేదు కామాంధులు. ఇక, యువతుల నుంచి సగటు మహిళ వరకు ఎదుర్కొనే హింస గురించి చెప్పాల్సిన పనే లేదు. కామపు కళ్లతో.. వెకిలి చేష్టలతో అడుగడుగునా స్త్రీలు అవమానాలకు గురవుతూనే ఉన్నారు. అయితే.. ఆకతాయిలే కాదు, ఉన్నతమైన పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా మహిళల పట్ల దారుణ వ్యాఖ్యలు చేయడం.. తరాలుగా వారి మనసుల్లో పేరుకుపోయిన భావజాలాన్ని ప్రతిబింబిస్తోంది. అసెంబ్లీ సాక్షిగా ఓ ఎమ్మెల్యే అత్యాచారాలను సమర్థించే విధంగా వ్యాఖ్యానించడం.. సంచలనంగా మారింది.
ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు మహిళలపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం.. ఆ తర్వాత నాలుక కరుచుకోవడం ఒక సాధారణ అలవాటుగా మారిపోయింది. అయితే.. సాక్షాత్తూ అసెంబ్లీలో చర్చలు జరుగుతున్న సమయంలోనూ నోరు పారేసుకోవడం మొదలు పెట్టారు కొందరు ప్రజాప్రతినిధులు. కర్నాటక అసెంబ్లీలో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే అత్యాచారాన్ని సమర్థిస్తున్నారనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ స్పీకర్.. ప్రస్తుత ఎమ్మెల్యే రమేశ్కుమార్ అవాంఛనీయ వ్యాఖ్యలు చేశారు. రైతుల సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీలో సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న సమయంలో.. స్పీకర్ను ఉద్దేశించి అంటూ ఆయన ఓ వ్యాఖ్య చేశారు.. లైంగిక దాడి అనివార్యమైనప్పుడు పడుకుని ఎంజాయ్ చేయాలి” అంటూ ఒక సామెత ఉందని అన్నారు.
మహిళల పట్ల ఇంత చులకన భావంతో ఆయన చేసిన వ్యాఖ్యలను సభలో ఇతరులు ఎవ్వరూ ఖండించకపోవడం గమనార్హం. పైగా.. రమేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు.. సభలో ఉన్న సభ్యులు అందరూ పగలబడి నవ్వడం గమనార్హం. అయితే.. రమేశ్ వ్యాఖ్యలపై అసెంబ్లీ బయట తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒక ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. మహిళల పట్ల చులకన భావం ఉన్న వారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.