హైదరాబాద్ మహానగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వ్యూహాత్మకంగా రోడ్లు నిర్మాణం చేపట్టి ఆ విధంగా ట్రాఫిక్ లేని రాజధానిగా మార్చాలని కేసీఆర్ సర్కార్ ఆలోచిస్తుంది. అభివృద్ధి ప్రణాళిక(ఎస్ఆర్డీపీ)లో భాగంగా నిర్మించిన ఎల్బీనగర్ రింగ్ రోడ్ అండర్ పాస్, కామినేని జంక్షన్ లో కుడివైపు నిర్మించిన ఫ్లై ఓవర్ ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఫ్లై ఓవర్ ప్రారంభంతో నాగోల్ నుంచి ఎల్బీనగర్ కు, సాగర్ రింగ్ రోడ్డు నుంచి నాగోల్ వెళ్లే వాహనదారులు, ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తీరాయి. అండర్ పాస్ తో ఓవైసీ జంక్షన్, శ్రీశైలం హైవేకు రాకపోకలు సులభతరం కానున్నాయి. రూ.14 కోట్ల వ్యయంతో ఎల్బీనగర్ రింగ్ రోడ్డు అండర్ పాస్ నిర్మాణం చేపట్టారు. కామినేని జంక్షన్ లో రూ. 43 కోట్లతో ఫ్లై ఓవర్ ను నిర్మించారు. మొత్తానికి ఎల్బీనగర్ రింగ్ రోడ్డు సిగ్నల్ ఫ్రీ జంక్షన్ గా మారింది.