Jayaprakash Narayan
Jayaprakash Narayan: జయప్రకాశ్నారాయణ.. చాలా మందికి ఈ పేరు సుపరిచితమే. అంతా గౌరవంగా జేపీగారు అనిపిలుస్తారు. అవినీతి వ్యతిరేక పోరాటానికి ఒక బ్రాండ్గా నిలిచారు జేపీ. ఇందుకోసం లోక్సత్తా అనే సంస్థను స్థాపించి అవినీతి వ్యతిరేక పోరాటంలో నిర్మాణాత్మక పాత్ర పోషించారు. ఐఏఎస్ అయి ఉండి.. పాలకుల పెత్తనం భరించలేక రాజీనామా చేశారు. లోక్సత్తాసంస్థ ద్వారా ప్రతీ పట్టణంలో సంస్థ ప్రతినిధులను ఏర్పాటు చేసి అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడారు. అయితే 2009లో లోక్సత్తా పేరుతోనే రాజకీయ పార్టీ స్థాపించారు. చట్టసభల్లో ఉండి అవినీతి పాలనపై పోరాడని ఆశించారు. కానీ, ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలవాలని చూశారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయనతోపాటు అనేక మంది పోటీ చేశారు. కానీ, డబ్బుల మయమైన ఎన్నికల్లో కేవలం జేపీగారు ఒక్కరే గెలవగలిగారు. సనత్నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టారు. నాడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతోంది. ఈ సమయంలో జేపీని తెలంగాణ ప్రాంత నేతలు, ప్రజలు ఆంధ్రా నేతగానే చూశారు. నాటి టీఆర్ఎస్ నేతలు అలాగే ప్రమోట్ చేశారు. దీంతో చాలా మంది లోక్సత్తా అభిమానులు నొచ్చుకున్నారు.
అసెంబ్లీలోనే దాడి..
తెలంగాణ ఉద్యమ సమయంలో నాడు రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి అనూహ్యంగా సీఎం పదవి చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో టీఆర్ఎస్ నేతలు జేపీపై తెలంగాణ వ్యతిరేకిగా తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. ఒకానొక దశలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని, నాడు అసెంబ్లీ ఆవరణలోనే బహుషా కేటీఆర్ లేదా హరీశ్రావు ఇద్దరిలో ఒకరు జేపీ తలపై కొట్టారు కూడా ఈ దృశ్యం నాడు అన్ని న్యూస్ చానెళ్లలోనూ ప్రచారం అయింది. ఈ ఘటనను చూసి చాలా మంది జేపీకి ఈ రాజకీయాలు అవసరమా అని నొచ్చుకున్నారు. నిజాయతీకి, నిర్మాణాత్మకమైన విమర్శలకు, సంస్కరణలపై ప్రజలను చైతన్యపర్చే జేపీపై దాడిచి నాడు చాలామంది తప్పు పట్టారు.
జేపీగారూ మీరు మారిపోయారండీ..
తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడం, రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోవడం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చకచకా జరిగాయి. తర్వాత జేపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు టీవీ డిబేట్లలో తాజా రాజకీయాలు, పథకాలు, ఉచితాలు, అనుచిత నిర్ణయాలపై మాట్లాడుతున్నారు. ఇలాంటి జేపీని ఇటీవలో తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ ఓ టీవీచానెల్లో ఇంటర్వ్యూపేరుతో తన పార్టీ ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఇది పూర్తిగా స్క్రిప్టెడ్ ప్రోగ్రాం ఇలాంటి కార్యక్రమానికి జేపీ హాజరు కావడమే చాలా మంది ఆయన సమకాలీకులు, ఆయనతో కలిసి లోక్సత్తాలో పనిచేసినవారికి ఇబ్బందిగా అనిపించింది. అదీ ఎన్నికల సమయంలో ఒక పార్టీని ప్రమోట్ చేసేలా ప్రోగ్రాం చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. చాలా మంది జేపీగారూ మీరు మారిపోయారు అని వ్యాఖ్యానిస్తున్నారు.
అభివృద్ధి సరే.. అవినీతిని ఎందుకు ప్రశ్నించలేదు..
ఈ ఇంటర్వ్యూలో అధికార బీఆర్ఎస్ను జయప్రకాశ్నారాయణ చాలా వరకు ప్రమోట్ చేశారు. ఉచిత పతకాలను వ్యతిరేకించే జేపీ, ఈ కార్యక్రమంలో మాత్రం ఉచితంగా డబ్బులు పంచే దళితబంధు, బీసీబంధు, మైనారిటీ బంధును ప్రశంసించడం గమనార్హం. ఇక ౖహె దరాబాద్ అభివృద్ధిని జేపీ ఆకాశానికి ఎత్తేశారు. ఇదంతా బీఆర్ఎస్ పాలనతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. కానీ ఎక్కడా అవినీతి, అరాచకాలు, కబ్జాలు, ప్రాజెక్టుల రీడిజైనింగ్ గురించి మాట్లాడలేదు. పైగా కాంగ్రెస్ను దేశ ద్రోహ పార్టీగా అభివర్ణించారు.
కట్టడాలే అభివృద్ధా..
జేపీగారూ.. మీరు అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. భవనాలను చూసి అభివృద్ధి అనడం జేపీ స్థాయిని దిగజార్చేలా ఉంది. సరే నిర్మాణాలే అనుకుందాం.. మరి హైదరాబాద్లో మెట్రో విస్తరణను అడ్డుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే, పాతబస్తీ వరకు విస్తరించకుండా ఆపింది కూడా బీఆర్ఎస్ సర్కారే. ఇది జేపీకి కూడా తెలుసు కానీ దీనిగురించి కేటీఆర్ను ఒక్కమాట కూడా అడగలేదు.
– ఒకప్పుడు మెట్రో విస్తరణలో హైదరాబాద్ కోల్కతా తర్వాత రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. మరో రెండు మూడేళ్లలో ఆరోస్థానానికి పడిపోవడం ఖాయం. ఈ విషయంపై జేపీ నోరు మెదపకపోవడం ఆశ్చర్యం.
– ఏటా వానాకాలంలో హైదరాబాద్ నీట మునుగుతోంది. ఇందుకు కారణం ఏంటో జేపీకి తెలియంది కాదు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో జరిగినన్ని కబ్జాలు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ జరుగలేదు. ఈ విషయం కూడా జేపీకి తెలియంది కాదు. కానీ ఆయన కేటీఆర్ను ఈ విషయమై ప్రశ్నింలేదు.
– హుస్సేన్సాగర్ను కొబ్బరినీళ్లలెక్క చేస్తా అన్న కేసీఆర్ పదేళ్లలో ఏమీ చేయలేదు. దీనిపై జేపీ మౌనం వహించారు.
– హైదరాబాద్లో డ్రెయినేజీలు, రోడ్లు ఆక్రమణకు గురయ్యాయి. చెరువులు కబ్జా అయ్యాయి. వరదలకు ప్రధాన కారణం ఈ కబ్జాలే. కానీ, వీటిగురించి జేపీ ప్రశ్నికపోవడం బాధాకరం.
– తెలంగాణ ప్రభుత్వం అత్యంత గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో వేల కోట్ల అవినీతి జరిగింది. అవినీతిపై ఉద్యమించే జేపీ దీని గురించి ఒక్క ప్రశ్నకూడా వేయలేదు.
ప్రమోషన్ వర్క్ ఎవరి కోసం..
గతంలో కేటీఆర్ ఓ టీవీ చానెల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్తో ఇంటర్వ్యూ చేయించుకున్నారు. తాజాగా జేపీతో మరో చానెల్లో ఇంటర్వ్యూ చేయించుకున్నారు. ఇవన్నీ ప్రమోషన్ కార్యక్రమాలే. జేపీఅయినా, నాగేశ్వర్ అయినా వెళ్లడం తప్పుకాదు. కానీ నిజాయతీ, నిబద్ధతకు మారుపేరుగా ఉన్న వ్యక్తులు ఎన్నికల సమయంలో ఒక పార్టీని ప్రమోట్ చేయడమే కాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది.