సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ జగన్ పార్టీలో చేరుతున్నారా? అంటే ప్రస్తుత పరిస్థితులు బట్టి అవుననే సమాధానం వస్తుంది. ఈ మధ్య ఒక టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు చాలామంది రాజకీయ నాయకులు చేయరు. కానీ జగన్ అందుకు భిన్నంగా.. మేనిఫెస్టోలో ఉన్న అంశాలను ప్రాధాన్యంగా చేస్తున్నారని కితాబిచ్చారు. ప్రజలే మేనిఫెస్టో తయారు చేసి రాజకీయ నేతల దగ్గర హామీ తీసుకోవాలని.. సంతకాలు పెట్టించుకోవాలన్నారు.
సీబీఐలో పనిచేసిన సమయంలో చాలా కీలకమైన కేసుల్ని దర్యాప్తు చేసినట్లు లక్ష్మీనారాయణ చెప్పారు. తన విధుల్ని నిర్వహించానని.. వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా ద్వేషం లేదని.. ఎవరిపైనా కక్షగట్టాల్సిన అవసరం లేదన్నారు. జగన్ కేసు దర్యాప్తు సమయంలో ఆయన తనకు విమానాశ్రయంలో ఎదురుపడ్డారని.. నమస్కారం అంటే నమస్కారం అంటూ పలకరించుకున్నామని ఆసక్తికర విషయాలు చేప్పారు. ఇక జగన్ ఆస్తుల కేసులో లక్షకోట్లు అంటూ జరుగుతున్న ప్రచారం గురించి తనకు తెలియదని.. ఆ కేసులో తాను ఉన్నంత వరకు రూ.1500కోట్ల వరకు ఛార్జ్షీట్లు వేశామన్నారు. తర్వాత కొన్ని జరిగాయనుకుంటున్నాను అన్నారు. సీబీఐలో పనిచేసే సమయంలో తనకు బెదిరింపులు వచ్చాయన్నారు మాజీ జేడీ. శత్రవులు కచ్చితంగా ఉంటారని.. తనకు బెదిరింపు లేఖలు వచ్చేవని.. కుటుంబంపై హాని చేస్తామని కొందరు బెదిరించారన్నారు.
పవన్ పై జేడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఫుల్ టైం పాలిటిక్స్ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానన్నారు లక్ష్మీనారాయణ. పవన కళ్యాణ్ ఫుల్ టైం కాదన్నారని.. తాను మాత్రం అలా కాదన్నారు. జనసేనను వీడేంందుకు కారణాలు చెప్పి బయటకు వచ్చానని.. రాజీనామాకు ముందు పవన్ ను కలవలేదన్నారు. ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయం తీసుకులేదని.. ఏ వేదిక కావాలి అనుకున్న రోజు.. ఏ వేదిక మార్పు తెస్తుంది అనుకుంటే ఆవైపు వెళ్లాలని నిర్ణయించుకుంటాను అన్నారు. వేరే పార్టీ అవసరం అనుకుంటే ఆ దిశగా వెళతానని చెప్పుకొచ్చారు. యువతలో మార్పు తేవాలనే ఉద్దేశమన్నారు.