Homeఆంధ్రప్రదేశ్‌సాగర్‌‌ సీటు వదులుకుంటున్న బీజేపీ.. బరిలో జనసేన..!

సాగర్‌‌ సీటు వదులుకుంటున్న బీజేపీ.. బరిలో జనసేన..!

Janasena BJP
మరికొద్ది రోజుల్లో నాగార్జునసాగర్‌‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలో బీజేపీ–జనసేన కలిసి బరిలోకి దిగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అన్ని ఉప ఎన్నికల స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. ఇంకా సాగర్‌‌లో మాత్రం కన్‌ఫాం చేయలేదు. అదే సమయంలో జనసేనతో పొత్తును కొనసాగించాలన్న పట్టుదలతో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తోంది.

అందుకే.. సాగర్‌ను జనసేనకు అప్పగించాలన్న ప్రతిపాదనలు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే.. తిరుపతిలో పోటీ చేయడానికి బీజేపీకి జనసేన నేతలు ఓకే చెప్పారు. తాము మద్దతిస్తున్నారు. ఇప్పుడు.. సాగర్ నుంచి కూడా బీజేపీ పోటీ చేయడం అంటే పొత్తు ధర్మాన్ని పాటించకపోవడమేనని.. జనసేనకు ఇస్తే బెటరన్న చర్చ జరుగుతోందని అంటున్నారు. అందుకే.. జనసేన పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

ఇప్పటికే జనసేన కూడా పార్టీ అభ్యర్థిని సెలక్ట్‌ చేసిందని.. రేపో మాపో నామినేషన్‌ కూడా వేయబోతున్నారని తెలుస్తోంది. జనసేన పార్టీ ఎస్టీ అభ్యర్థినే నిలబెట్టబోతున్నట్లుగా సమాచారం బయటకు వచ్చింది. సాగర్ పై జనసేనాని పవన్ దృష్టి సారించి ఓ కమిటీని నియమించారు. ఆ కమిటీ ఇప్పటికే అభ్యర్థిని ఫైనల్ చేసింది. బీజేపీతో సంబంధం లేకుండా జనసేన ప్రచారకమిటీని నియమించింది. ఆ పార్టీ చాపకింద నీరులా ప్రచారం చేసుకుంటోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం తర్వాత తెలంగాణ బీజేపీ నేతలకు కూడా జ్ఞానోదయం అయింది. జనసేనతో కలిసి పని చేస్తామని చెప్పడం ప్రారంభించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం.. నల్లగొండ స్థానంలో నాలుగో స్థానం రావడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ పోటీ చేయకపోతేనే ఇప్పుడున్న హైప్ ఉంటుందని.. ఒకవేళ పోటీ చేసి డిపాజిట్ కూడా తెచ్చుకోకపోతే మొత్తానికే మోసం వస్తుందని కమలనాథులు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. సాగర్ టికెట్‌ను జనసేనకు వదిలేస్తే.. రాజకీయంగా బీజేపీ ఆత్మహత్య చేసుకున్నట్లేనని కొంత మంది నేతలు హెచ్చరిస్తున్నారు. సాగర్‌ నియోజకవర్గం అంశంపై బీజేపీలో ఊపు తగ్గిపోవడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి రెండు వేల ఓట్లు తెచ్చుకున్న నివేదితారెడ్డి మళ్లీ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కానీ.. ఆమెకు పార్టీ బీఫాం దొరుకుతుందా అనేది ప్రశ్నగా మారింది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version