Homeఆంధ్రప్రదేశ్‌Janasena:‘కియా’ భూస్కాంను తవ్వి తీస్తున్న జనసేన..

Janasena:‘కియా’ భూస్కాంను తవ్వి తీస్తున్న జనసేన..

Janasena: ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి ‘కియా’ వ్యవహారం మెడకు చుట్టుకునేలా ఉంది. కియాకు అనుబంధంగా ఏర్పాటైన ‘సైంటిఫిక్ ప్రాసెసింగ్’కు భూమి ఇచ్చామని చెబుతూ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని జనసేన ఆరోపిస్తోంది. ఏ చిన్న పరిశ్రమకు భూమి కేటాయించినా గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ‘సైంటిఫిక్ ప్రాసెసింగ్’ సంస్థకు భూమి కేటాయించినట్లు బహిరంగంగా ఎక్కడా చెప్పలేదు. అంతేకాకుండా ఈ సంస్థలో ఎంతమందికి ఉద్యోగాలిస్తున్నారు..? లాంటి వివరాలు బయటికి రానివ్వడం లేదు. దీంతో ‘సైంటిఫిక్ ప్రాసెసింగ్’ సంస్థ లాగే మరెన్ని సంస్థల పేరిటి వైసీపీ ప్రభుత్వం భూస్కాంకు పాల్పడిందోననే అనుమానం ఉందని జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏపీ రాజకీయంలో ‘కియా’ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

దక్షిణ కొరియాకు చెందిన హ్యూందాయ్ అనుబంధ సంస్థ అయిన ‘కియా’ కంపెనీ కార్ల ప్లాంట్ ను ఏపీలోని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేశారు. 2019 జనవరిలో ఈ ప్లాంట్ నుంచి మొదటి కారు బయటకు వచ్చింది. ఈ ప్లాంట్ కోసం రూ.13,500 కోట్లు వెచ్చించినట్లు అప్పటి సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అయితే ఈ ప్లాంట్ లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ నాయకులు ఆ సమయంలో ఆరోపించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాకా.. కియాతో కలిసి పనిచేసింది. అయితే ఇప్పుడు కియా కంపెనీ నుంచి ‘సైంటిఫిక్ ప్రాసెసింగ్’ అనే సంస్థ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ సంస్థ ఏర్పాటు కోసం ప్రభుత్వం 63 ఎకరాలు ఇచ్చిందని లెక్కల్లో చూపిస్తుందని జనసేన పార్టీ ఆరోపిస్తోంది. అయితే ఈ సంస్థ వివరాలు మాత్రం ఎక్కడా చెప్పలేదని అంటున్నారు.

కియా ‘సైంటిఫిక్ ప్రాసెసింగ్’సంస్థ వివరాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచడంపై ప్రకంపనలు మొదలయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి ఇలాంటి విషయాలను బహిరంగంగా గొప్పులు చెప్పుకోవాలి. కానీ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 63 ఎకరాల ఆ సంస్థకు ఇవ్వడంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే సంస్థ ఏర్పాటు కోసం భూమిని కేటాయించినా.. ఆ సంస్థ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం ఉందో ప్రభుత్వం చెప్పకపోవడంపై నిరసన వెల్లువెత్తుతోంది. ఒక సంస్థ ఏర్పాటుపై ముఖ్యంగా ఆ ప్రాంత యువతరానికి ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్ ఉంటుంది. 2019 కియా మొదటికారు ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యక్షంగా.. పరోక్షంగా 11వేల మందికి ఉపాధి కలగనుందని తెలిపారు.

కానీ ఇప్పుడు సీఎం జగన్ అలాంటి వివరాలు ఎక్కడా చెప్పకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయని జనసేన ఆరోపిస్తోంది. అయితే ‘సైంటిఫిక్ ప్రాసెసింగ్’ సంస్థ పేరుతో భూ అక్రమాలకు పాల్పడ్డారా..? అని ఆరోపిస్తున్నారు. ఇక ఇలాంటి ఎన్ని ఫేక్ సంస్థలు ఏర్పాటు చేసి భూ అక్రమాలకు పాల్పడ్డారోనని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు భూమి పొందిన ఏ కంపెనీలు ప్లాంట్ ను ఏర్పాటు చేశాయో.. లేవోననే స్పష్టత లేదు. పాత కంపెనీల వివరాలే పదే పదే చెబుతున్నారు. కొత్తగా వచ్చిన కంపెనీల గురించి ఎలాంటి వివరాలు బహిర్గతం చేయడం లేదు. దీంతో ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసన వెల్లువెత్తుతోంది. సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ వైసీపీ ప్రభుత్వం ఈ ఆరోపణ నుంచి ఎలా బటయటపడుతుందో చూడాలి

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version