జనసేన బీజేపీ పొత్తుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీ బీజేపీ తోనే కలిసి పని చేయాలని నిర్ణయించుకుందని… రాష్ట్ర స్థాయిలోనూ, పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయిలోనూ ఇరు పార్టీల మధ్య సమన్వయం కోసం కమిటీలను కూడా ఏర్పాటు చేసుకున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. ఏదైనా రాజకీయ కూటమితో కలిసి పనిచేయాలని ఆహ్వానం వస్తే… అందులో బీజేపీ కూడా ఉంటేనే వారితో కలిసి పని చేయాలని పవన్ కళ్యాణ్ జనసేన నేతలకు సూచించారు. బీజేపీ లేని కూటమితో భాగస్వాములు కావద్దని మరోసారి తేల్చిచెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం, పోరాటం కోసం ఇతర రాజకీయ పక్షాలతో కలిసి ముందుకు వెళ్లవలసిన పరిస్థితులు ఏర్పడినప్పుడు జనసేన పార్టీకి మిత్రపక్షమైన బీజేపీతో కలిసి ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ జనసేన నేతలకు సూచించారు. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో బీజేపీయేతర పార్టీ నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని కొందరు పార్టీ నేతలు తన దృష్టికి తీసుకొస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.