Janasena Aavirbhava Sabha on the 14th of this month: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాన్ పార్టీకి జవసత్వాలు నింపేందుకు సిద్ధమయ్యారు. పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించారు. త్వరలో పార్టీ ఆవిర్భావసభ జరగనుంది. ఈ మేరకు జనసైనికులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ విజయవంతం కోసం పార్టీలోని కీలక నాయకులు ఇప్పటికే బిజీ అయ్యారు. మంగళగిరిలో సభను నిర్వహించేందుకు స్థల పరిశీలన కూడా చేశారు. అయితే 14న నిర్వహించే ఈ సభతో పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఈ సభలో అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనన్న ఉత్కంఠ ఊపేస్తోంది. మరోవైపు ప్రభుత్వం ఈ సభ జరగకుండా చేయాలని ప్లాన్ వేస్తోందని కొందరు ఆరోపిస్తున్నారు. దీంతో 14న జరిగే సభతో పార్టీలోనూ.. ప్రభుత్వంలో టెన్షన్ వాతావరణం నెలకొందని చర్చించుకుంటున్నారు.
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒక్కటంటే ఒక్కటే సీటు గెలుచుకుంది. అది కూడా అధికార పక్షాన చేరిపోయింది. దీంతో ఈసారి జరిగే ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని జనసేన సీరియస్ గా పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రజల్లో కొంత సానుభూతిని సంపాదించిన పార్టీ.. ఇప్పుడు ఇక వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో మార్చి 14న నిర్వహించే సభ కీలకంగా మారిందని అంటున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తి చేసుకున్నందున మరో రెండేళ్లలో పార్టీ అభివృద్ధి చెందేలా పనిచేయాలని పవన్ కళ్యాణ్ దిశానిర్ధేశం చేయనున్నారు.
మొదట్లో జనసేనపై కాస్తా నమ్మకం లేకపోయినా పవన్ కళ్యాణ్ వరుసబెట్టి ప్రజా కార్యక్రమాలను చేస్తుండడంతో పార్టీపై సానుభూతి పెరిగింది. ప్రజలతో పాటు ఇతర పార్టీల నాయకుల్లోనూ ఆశలు పెరిగాయి. దీంతో అధికార వైసీపీలో కిందిస్థాయి నాయకులు జనసేనలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈమేరకు 14న కొందరు ముఖ్య నాయకులు పార్టీలో చేరబోతున్నారని సంకేతాలు వస్తున్నాయి. ఇక కాంగ్రెస్ ఇతర పార్టీల్లోని నాయకులు సైతం జనసేనలో చేరాలని ఆసక్తి చూపుతున్నారు. అవసరమైతే ఎమ్మెల్యే టికెట్ హామీ ఇచ్చి అయినా సరే ప్రజల్లో మంచి పేరున్న నాయకుడిని చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
జనసేన సభ జరగకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందని కొందరు జనసేన సైనికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో ఆదరణ పొందుతున్న పవన్ కళ్యాణ్.. 14న నిర్వహించే జనసేన సభతో మరింతగా చెలరేగిపోవడం ఖాయం. ఈ సభతో ప్రభుత్వ వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని కొందరు అంటున్నారు. దీంతో సభ నిర్వహణకు అడ్డంకులు సృష్టిస్తున్నారని అంటున్నారు. అయితే 14న నిర్వహించే సభకు జనసమీకరణ బాగానే ఉండనున్నట్లు సమాచారం. పార్టీ పరంగా కాకుండా ఫ్యాన్స్ ఈ సభకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీకి సంబంధించిన క్రీయాశీలక సభ్యులు హజరవ్వాలని ఇప్పటికే ఆదేశించారు. ఈ సభలో తీసుకునే నిర్ణయాలు వచ్చే ఎన్నికలకు సంబంధం ఉండే అవకాశం ఉండనుందని అంటున్నారు.
మరోవైపు టీడీపీతో జనసేన పొత్తు అన్న విషయంపై కూడా ఈ సభలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతకాలం టీడీపీ నాయకులు జనసేనకు సపోర్టు చేస్తూ వస్తున్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సైతం పరోక్షంగా జనసేనతో కలిసి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే పవన్ మాత్రం ఏ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఆవిర్భావ సభలో పొత్తు పై తేటతెల్లం చేసే అవకాశాలున్నాయని పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.