పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాకోసం మూడేళ్లుగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్ కాబోతోంది. దీంతో.. వారి ఆనందానికి హద్దేలేకుండా పోయింది. అయితే.. ఆంధ్రప్రదేశ్ లో విడుదల విషయంలో అడ్డంకులు ఎదురవుతున్నట్టు సమాచారం. దీంతో.. పవన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే పవన్ సినిమాను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు.
సహజంగా పెద్ద హీరోల చిత్రాలు ఏవి రిలీజ్ అయినా.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు జారీచేసేవి. అవసరాన్ని బట్టి రేట్లు పెంచుకోవచ్చని కూడా తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అయితే.. ఏపీ సర్కారు మాత్రం వకీల్ సాబ్ కు అడ్డంకులు సృష్టిస్తోందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఏపీలోని పలు థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేసినట్టు సమాచారం. టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి లేదని, తమ ఆదేశాలను బేఖాతరు చేస్తే థియేటర్లను సీజ్ చేస్తామని కూడా హెచ్చరించినట్టు తెలుస్తోంది.
దీనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. థియేటర్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లు విక్రయించేశామని.. 9, 10 తేదీలకు అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తయ్యాయని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ రెవెన్యూ అధికారులు ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే తాము ఏం చేయాలని ఆవేదన వ్యక్తంచేస్తున్నట్టు సమాచారం.
మెగా ఫ్యాన్స్ మాత్రం సర్కారు తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇతర హీరోల సినిమాలకు అనుమతులు ఇచ్చి, పవన్ సినిమాకు మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ కక్షసాధింపులు సరికాదని, రాజకీయాలను.. సినిమాలను వేరుగా చూడాలని కోరుతున్నారు. మరి, ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.