ఎన్నికల వాయిదాకు ప్రతిపక్షాల మద్దతు:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి జరుగుతున్న హింసాత్మక సంఘటనలు, ప్రభుత్వం, పోలీసుల పక్షపాత వైఖరులను ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంతో పాటు ఇతర పార్టీలు బీజేపీ, జనసేన, సీపీఐ ఖండిస్తూ వస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఈ ఎన్నికలను వాయిదా వేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ పార్టీలు ప్రజల్లోకి తీసుకెళ్ళాయి. ప్రజల ప్రాణాల కన్నా ఎన్నికలు ముఖ్యం కాదనేది ఈ పార్టీల వాదనగా ఉంది. మరోవైపు ఇళ్ల పట్టాల పంపిణీ, కొత్త రేషన్ కార్డుల జారీ పేరుతో ప్రజల్లో ఆశలు కల్పించి ఎన్నికల్లో ఓట్లు పోగేసుకోవాలనుకుంటున్న వైసీపీకి వాయిదా పడటం సుతరామూ ఇష్టం లేదు.
తప్పులను కప్పి పుచ్చుకునేందుకే:
మూడు రాజధానులు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన వంటి అంశాలపై ప్రతిపక్షాలు, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా, ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా.. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు సమర్థిస్తున్నారని చెప్పుకోవాలని వైసీపీ వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానుల ప్రతిపాదన చేయడానికి ప్రధాన కారణం టీడీపీని దెబ్బ తీయడానికేనన్న విషయం అందరికీ తెలిసిందే. మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రజలు అంగీకరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని గెలిపించారన్న వాదనను తెరపైకి తీసుకురావాలని ఆ పార్టీ భావించింది. టీడీపీకి పట్టున్న అన్ని పంచాయతీల్లో ఎన్నికలు నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం అదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి, జక్కంపూడి పంచాయతీ, తదితర ప్రాంతాలకు అసలు ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదల చేయలేదు. దీని వెనుక అసలు ఆలోచన అదేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.