Jagan- Amit Shah: దేశ రాజకీయాలు యువత భవిష్యత్ను ఫణంగా పెడుతున్నాయి. పాలకులు తమ భావజాల వ్యాప్తి కోసం రాజకీయ విలువలను దిగజారుస్తున్నారు. తాజాగా జరుగుతున్న భాషా రాజకీయాలు ఇందుకు నిదర్శనం.

ఇంగ్లిష్ మీడియం వైపు తెలుగు రాష్ట్రాల చూపు..
తెలుగుమీడియం వద్దు ఇంగ్లిష్ మీడియం ఒక్కటి చాలు అంటూ .. రెండు తెలుగు రాష్ట్రాలు పాఠశాల స్థాయిలో ఆంగ్ల మాధ్యమ బోధన ప్రారంభించాయి. ఏపీ సీఎం ఇంగ్లిష్ మీడియం ప్రారంభించి రెండేళ్లు దాటింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ ఏడాది నుంచి పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న నిర్వాకానికి ఎన్ని లక్షల మంది పిల్లలు మానసిక వేదనకు గురవుతున్నారో కళ్ల ముందు ఉంది. తెలంగాణలో తెలుగు మీడియం పూర్తిగా తొలగించనపపటికీ ఇంగ్లిష్ మీడియం ఎంట్రీతో భవిష్యత్తో తెలుగు మీడియం కనుమురుగు కానుంది.
బలవంతంగా హిందీ రుద్దుతున్న కేంద్రం..
మాతృభాషకు దూరమవుతున్న తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ భవిష్యత్పై కేంద్రం హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తోంది. ఈమేరకు నిర్ణయం తీసుకుంటోంది. ఇంగ్లిష్ వద్దు దేశం అంతా హిందీ మీడియం ఉండాలంటోంది. ఈమేరకు కేంద్రమంత్రి అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. విద్యాసంస్థల్లో హిందీ మీడియం మాత్రమే ఉండేలా.. ప్రభుత్వ ఆఫీసుల్లో వ్యవహారాలు, ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ హిందీలోనే జరిగేలా.. ప్రతిపాదనలు చేసింది. భారతీయులకు ఇంగ్లిష్ను దూరం చేయడమే లక్ష్యంగా.. ఈ ప్రతిపాదనలు చేశారు. అమిత్షా నేతృత్వంలోని కమిటీ మొత్తం 112 సిఫారసులతో.. 11వ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది.
వర్సిటీల్లో హిందీ మీడియం…
టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యాసంస్థలతోపాటు సెంట్రల్ యూనివర్సిటీల్లోనూ.. హిందీ మీడియమే ఉండేలా చర్యలు తీసుకోవాలని అమిత్షా నేతృత్వంలోని కమిటీ సిఫారసు చేసింది. దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో ఇంగ్లి్లష్ను ఆప్షనల్గా మార్చాలని ప్రతిపాదించారు.

మండిపడుతున్న దక్షిణాది రాష్ట్రాలు..
కేంద్రం చేసిన సిఫారసులపై దక్షిణాది రాష్ట్రాల్లో విమర్శలు ప్రారంభమయ్యాయి. – భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఐఐటీలు, కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో హిందీని మాత్రమే అమలు చేయాలని నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
– భాష విషయంలో ఇలాంటి సిఫార్సులు కరెక్ట్ కాదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇదే విషయమై ప్రధాని మోదీకి లేఖ రాశారు.
– కేంద్రం సిఫారసులు.. అన్ని భాషలపై ఒకేసారి వేటు వేయడం లాంటిదని తమిళనాడు సీఎం స్టాలిన్ అభిప్రాయపడ్డారు.
కేంద్రం సిఫారసులపై ఇతర రాష్ట్రాల్లోనూ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. రాజకీయాల కోసం మాతృభాషను చంపేసేందుకు రాజకీయ పార్టీలు ఏ మాత్రం వెనుకాడకపోవడం ఈ భాషా రాజకీయంలో అసలు విషాదం.