షర్మిల తెలంగాణలో కాలు పెట్టగానే జల వివాదాల గండం ముందుకొచ్చింది. రెండు స్టేట్ల మధ్య పెద్ద దుమారమే రేగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో ఎడమెహం పెడమొహంలా ఉన్నారు. అసలే సమైక్యాంధ్ర కుటుంబం అని తేడాలు చూపించే క్రమంలో ఏపీ, తెలంగాణ మధ్య తలెత్తిన నీటిపారుదల ప్రాజెక్టుల సమస్యపై గళం విప్పాల్సి వచ్చింది. కేసీఆర్,జగన్ పరస్పరం ఇళ్లకు వెళ్లి భోజనాలు చేసుకున్న నేతలు కలిసి ఎందుకు మాట్లాడుకోవడం లేదని షర్మిల సూటిగా ప్రశ్నించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉంది. ఈలోగా షర్మిల తనపై ఉన్న సమైక్యాంధ్ర ముద్ర తొలగించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తన తండ్రి వైఎస్సార్ వారసత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంది. తెలంగాణ ప్రాజెక్టుల్ని టార్గెట్ చేస్తున్న వైఎస్ జగన్ ను కౌంటర్ చేయాల్సిన పరిస్తితి తలెత్తింది. ఈ ప్రయత్నంలో షర్మిల ఎంత సక్సెస్ అయితే అంత ప్రజాదరణ దక్కనుంది.
జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న షర్మిల జగన్ పైనే విమర్శలు చేసే స్థాయికి వెళ్లింది. మొహమాటాలకు పోకుండా జగన్ పైనే పోరాటానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం షర్మిల విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు. షర్మిల విమర్శలు తీవ్రమైతే కౌంటర్ ఇచ్చే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. ఈసందర్భంలో విపక్షాలు సైతం షర్మిలపై విరుచుకుపడడం ఖాయమే అనిపిస్తోంది.