AP Journlists : ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. సాధ్యమేనా?

అందుకే వీలైనంత త్వరగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరు ప్రక్రియ ప్రారంభించాలని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.

Written By: NARESH, Updated On : November 3, 2023 6:24 pm
Follow us on

AP Journlists : ఏపీ సర్కార్ జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ క్యాబినెట్ సమావేశంలో 38 అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఏపీలో కులగననకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నవంబర్ 15 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు.

గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టులకు సంబంధించి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్న డిమాండ్ వినిపిస్తూ వస్తోంది. దీనిని పరిగణలోకి తీసుకున్న క్యాబినెట్ అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అంగీకరించింది. వరుసుగా ఐదేళ్లపాటు అక్రిడేషన్ ఉన్నవారికి మాత్రమే వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అక్రిడేషన్ విషయంలో జగన్ సర్కార్ అనేక నిబంధనలు పెట్టింది. చాలామంది అర్హులకు సైతం అక్రిడేషన్లు మంజూరు కాలేదు. కేవలం పెద్ద పత్రికలకు తప్పించి… చిన్న పత్రికలకు మొండి చేయి చూపడంతో ఇప్పటికే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల ప్రకటన రావడంతో అక్రిడేషన్ లేని జర్నలిస్టుల్లో ఆందోళన నెలకొంది.

అయితే ఎన్నికలకు పట్టుమని ఆరు నెలల వ్యవధి కూడా లేదు. సంక్రాంతి అనంతరం ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.ఈ లెక్కన మరో నెలే అవకాశం ఉంది. గతంలో చంద్రబాబు సైతం ఎన్నికలకు వెళ్తాను అనగా.. ఆరు నెలల ముందు ఇదేవిధంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ప్రకటించారు. కానీ మంజూరు ప్రక్రియ జరుగుతుండగా ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడైంది. దీంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. జర్నలిస్టుల్లో వ్యతిరేకతకు ఇదో కారణమైంది. ఇప్పుడు గానీ జగన్ జాగ్రత్త పడుకుంటే అదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. అందుకే వీలైనంత త్వరగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరు ప్రక్రియ ప్రారంభించాలని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.