Homeజాతీయ వార్తలుIndira Gandhi : పార్లమెంట్ ఎన్నికల ముందు కలకలం.. తెరపైకి ఇందిరా గాంధీ స్విస్ బ్యాంకు...

Indira Gandhi : పార్లమెంట్ ఎన్నికల ముందు కలకలం.. తెరపైకి ఇందిరా గాంధీ స్విస్ బ్యాంకు వివాదం..

Indira Gandhi : ఇప్పటికే ఐటీ అధికారులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు. ఆదాయపు పన్ను చెల్లించాలంటూ కోర్టుకు వెళ్లారు. అంతేకాదు పార్టీ ఖాతాలో ఉన్న నగదును మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామంతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతోంది. పార్లమెంటు ఎన్నికల ఖర్చుకు నిధులు ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నది. ఇది సరిపోదన్నట్టుగా తాజాగా మరో వివాదం ఆ పార్టీని కుదిపేస్తోంది. అది కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు తెరపైకి రావడంతో ఆ పార్టీకి ఏం చేయాలో అంతు పట్టడం లేదు. దొరికిందే అవకాశంగా బిజెపి విమర్శలు గుప్పిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

1979 డిసెంబర్ 31 ప్రముఖ హిందీ పత్రిక అమర్ ఉజాలా లో ఓ కథనం ప్రచురితమైంది. ఇంతకీ అందులో అసలు విషయం ఏంటంటే.. అప్పట్లో ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ ఉన్నప్పుడు స్విస్ బ్యాంకు నుంచి 60 కోట్లు విత్ డ్రా చేశారట.. వాటిని పార్లమెంట్ ఎన్నికల కోసం ఉపయోగించారట. ఆ నిధులతో ఎన్నికల ప్రచారం కోసం పదివేల జీపులు కొనుగోలు చేశారట. అంతేకాదు ఒక్కో కాంగ్రెస్ అభ్యర్థికి ఐదు లక్షల దాకా ఎన్నికల ఖర్చు కింద ఇచ్చారట. ఈ డబ్బులు విదేశాల నుంచి ఇతర మార్గాల ద్వారా ముంబైకి వచ్చాయట.. అప్పటి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు ఇందిరాగాంధీ ఇలాంటి మార్గాలు ఎంచుకున్నారట.. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని బిజెపి నాయకులు ప్రధానంగా ప్రస్తావించడం విశేషం. ” నాడు ఎన్నికల్లో దొడ్డిదారిలో గెలిచేందుకు ఇందిరాగాంధీ ప్రయత్నాలు చేశారు. అందుకు అమర్ ఉజాల పత్రికలో వెలువడిన కథనమే ఉదాహరణ అంటూ” బిజెపి నాయకులు విమర్శిస్తున్నారు.

అయితే ఇందిరా గాంధీ స్విస్ బ్యాంకు నుంచి మొదట్లో 40 కోట్లు మాత్రమే విత్ డ్రా చేశారని, తర్వాత అది 60 కోట్లుగా తేలిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పటి ప్రధానమంత్రి చరణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా లక్నోలోని హజరత్ మహల్ పార్క్ వద్ద ప్రసంగించారు. “ఇందిరా గాంధీ స్విస్ బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేశారు. వాటిని ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆ డబ్బులతో పదివేల జీపులు కొనుగోలు చేశారు. ఆ నగదు విదేశాల నుంచి ముంబై మహా నగరానికి పెద్ద ఎత్తున వచ్చింది” అంటూ చరణ్ సింగ్ ఆరోపించారు. ఆయన ఆరోపణల నేపథ్యంలో భారత ప్రభుత్వం స్విస్ బ్యాంకు అధికారులను వివరణ కోరింది. విచారణ జరపాలని విన్నవించింది. అయితే ఈ కేసు చుట్టూ అనేక సంక్లిష్టతలు ఉన్నాయి. న్యాయ పరిధి కూడా అదే తీరుగా ఉండడంతో నిధులు ట్రాక్ చేయడం సవాల్ గా మారిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ కోణంలో విచారణ వేగవంతం చేశారు. ఇక, అప్పటి ఎన్నికల్లో జరిగిన వివాదాలు ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తున్నాయి. వీటిని ప్రధానంగా ప్రస్తావిస్తూ బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. మరి దీనిపై కాంగ్రెస్ నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version