Rajnath Singh Warning To Pakistan: ఆర్థిక సంక్షోభం ఒకవైపు.. యుద్ధంతో ఇంధన సంక్షోభం ఇంకోవైపు.. ఆఫ్గానిస్తాన్ దాడులు మరోవైపు.. అంతర్గతంగా ఖైబర్ఫఖ్తూఖ్వా, బలూచ్ తిరుగుబాట్లు.. మరోవైపు ఇచ్చిన అప్పులు తీర్చాలని యూఏఈ, సౌదీ అరేబియా, చైనా ఒత్తిడి.. ఈ పరిస్థితి నుంచి పాకిస్తాన్ ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ కవాజా ఇటీవల భారత్పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తమ జోలికి వస్తే భారత్ లోపలికి వెళ్లి మరీ దాడులు చేస్తామని హెచ్చరించారు. దీనికి తాజాగా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో హెచ్చరిక జారీ చేశారు. ‘బెంగాల్పై కన్నేస్తే, ఈసారి పాకిస్తాన్ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలుసు‘ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 55 ఏళ్ల కిందట (1971) ఇలాంటి ప్రగల్భాల వల్లే పాకిస్తాన్ రెండు ముక్కలైందని, ఆ చరిత్రను మర్చిపోవద్దని ఖవాజాకు చురకలంటించారు.
1971 యుద్ధం చరిత్ర..
1971లో పాకిస్తాన్ ప్రెసిడెంట్ యహ్యా ఖాన్, జనరల్ నియాజీ ‘భారత్ను చిత్తుగా ఓడిస్తామని‘ ప్రగల్భాలు పలికారు. పశ్చిమ పాకిస్తాన్ సైన్యం తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్)లో అత్యాచారాలు, హత్యలు చేసింది. భారత్ 13 రోజుల యుద్ధంలో పాకిస్తాన్ను చిత్తుగా ఓడించి, 93 వేల మంది సైనికులను బందీలుగా తీసుకుంది. తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది. పాకిస్తాన్ విస్తీర్ణం 40 శాతం తగ్గిపోయింది, అంతర్జాతీయంగా అవమానం ఎదురైంది.
తాజాగా హెచ్చరిక వెనుక ఆంతర్యం..
ఖవాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఈసారి పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని రాజ్నాథ్ వార్నింగ్ ఇచ్చారు. ఇది భారత్ సైనిక సిద్ధత, వ్యూహాత్మక సందేశం. 1971లో పరిమిత ఆయుధాలు ఉండేవి. కానీ ఇప్పుడు యుద్ధ ట్యాంకులు, రాఫేల్, ఎస్ – 400, అగ్ని–5 వంటి క్షిపణులు ఉన్నాయి. మరోవైపు పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం, రాజకీయ అస్థిరత ఎదుక్కొంటోంది. బలూచిస్తాన్లో స్వాతంత్య్ర ఉద్యమం తీవ్రమైంది. సింధ్లో ఉద్యమం ఉంది. ఖైబర్ పఖ్తున్ఖ్వాలో తాలిబన్ ప్రభావం పెరిగింది. ఇలాంటి పరిస్థితిలో యుద్ధం వస్తే, పాకిస్తాన్ 3–4 ముక్కలు కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బెంగాల్పై దృష్టి ఎందుకు?
పశ్చిమ బెంగాల్ భారత్ తూర్పు రక్షణ కవచం. 1971లో బంగ్లాదేశ్ వైపు నుంచి పాకిస్తాన్ దాడి చేసింది. ఈసారి బెంగాల్పై కన్నేస్తే, భారత్ రెండు రంగాల నుంచి (పశ్చిమం, తూర్పు) దాడి చేస్తుంది. భారత్ వాయుసేన ఇస్లామాబాద్, లాహోర్, కరాచీలను లక్ష్యంగా చేసుకోవచ్చు. నౌకాదళం కరాచీ ఓడరేవును దిగ్బంధించవచ్చు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతుంది.
భారత్ యుద్ధానికి సిద్ధంగా ఉంది, కానీ శాంతిని కోరుకుంటోంది. పాకిస్తాన్ ప్రగల్భాలు కొనసాగిస్తే, 1971 కంటే తీవ్రమైన ఫలితం ఎదురవుతుంది. బలూచిస్తాన్ స్వాతంత్య్రం, సింధ్ విడిపోవడం, ఖైబర్ పఖ్తున్ఖ్వా తాలిబన్ చేతుల్లోకి వెళ్లడం జరగవచ్చు. పాకిస్తాన్ చివరికి 50 శాతం విస్తీర్ణం కోల్పోయి, చిన్న రాజ్యంగా మారే ప్రమాదం ఉంది.