India Fuel Supply 60 Days Stock: గల్ఫ్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన కొరత ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం చేసింది. లక్షల కోట్ల సంపద ఆవిరైంది. చమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ కొరత ఏర్పడింది. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. మరోవైపు భారత్లో చమురు కొరత లేకపోయినా ఎల్పీజీ కొరత ఏర్పడింది. దీంతో కేంద్రం గృహ, కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచింది. అయినా ఎల్పీజీ సరిపడా లేకపోవడంతో కమర్షియల్ సరఫరా నిలిపివేసింది. తాజాగా ఐదు రోజుల యుద్ధ విమరణ, భారత్ ఇరాన్తో జరిపిన చర్చలు, ఇరుదేశాల దౌత్య సంబంధాలతో హార్మూజ్లో చిక్కుకున్న భారత నౌకలు భారత్కు వస్తున్నాయి. ఈ క్రమంలో భయాలను పటాపంచలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాబోయే 60 రోజులకు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్కు ఎలాంటి లోటు ఉండదని, వంటగ్యాస్ (ఎల్పీజీ) సరఫరా కూడా యథావిధిగా సాగుతుందని స్పష్టం చేసింది.
రెండు నెలలకు సరిపడా నిల్వలు..
కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలోని ప్రతీ పౌరుడి అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయి. వచ్చే 60 రోజులకు సరిపడా స్టాక్ సిద్ధంగా ఉంది. తర్వాతి రెండు నెలలకు అవసరమైన ముడిచమురు దేశానికి చేరుతోంది. హార్ముజ్ జలసంధి మూతపడినా, ఇతర మార్గాల ద్వారా 70% క్రూడాయిల్ సరఫరా కొనసాగుతోంది. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, ఇతర దేశాల నుంచి 8 లక్షల టన్నుల ఎల్పీజీ దిగుమతికి ఏర్పాట్లు జరిగాయి. వచ్చే నెల రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
సరఫరా వ్యూహంలో మార్పులు
ఇరాన్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి వద్ద ప్రతికూల పరిస్థితులు ఉన్నా, భారత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 41కి పైగా దేశాల నుంచి క్రూడాయిల్ను దిగుమతి చేసుకుంటోంది. ఇంతకు ముందు హార్ముజ్ ద్వారా వచ్చిన దానికంటే ఎక్కువ ముడిచమురు ఇప్పుడు ఇతర మార్గాల్లో వస్తోంది. దేశంలోని అన్ని చమురు శుద్ధి కర్మాగారాలు (రిఫైనరీలు) వంధశాతం కన్నా ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తున్నాయి.
అనవసర బుకింగ్స్తో ఇబ్బందులు..
గ్యాస్ కొరత వస్తుందనే భయంతో ప్రజలు ముందే బుక్ చేసుకోవడం వల్ల తలెత్తింది. గత కొన్ని రోజులుగా డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక ఆలస్యం జరిగినా, సరఫరా వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తోంది. గృహ వినియోగదారులకు వంద శాతం ఎల్పీజీ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం ధ్రువీకరించింది.
భారత్ ఇంధన భద్రతా వ్యూహం
భారత్ ఇంధన భద్రత కోసం 85 శాతం క్రూడ్ ఆయిల్ దిగుమతిని 41కిపైగా దేశాల నుంచి కొనసాగిస్తోంది. రిఫైనరీలన్నీ వందశాతానికిపైగా సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. మరోవైపు 8 లక్షల టన్నుల ఎల్పీజీ అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా నుంచి వస్తోంది. దీంతో పెట్రోల్ 60 రోజులకు, డీజిల్ 90 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి.
ప్రపంచంలో ఏం జరిగినా భారత ఇంధన భద్రతకు లోటు లేదని కేంద్రం స్పష్టం చేసింది. వ్యూహాత్మక నిల్వలు, వైవిధ్యీకృత దిగుమతి మార్గాలు, పూర్తి సామర్థ్యంతో నడుస్తున్న రిఫైనరీలు దేశాన్ని ఇంధన సంక్షోభం నుంచి కాపాడుతున్నాయి. ప్రజలు ధైర్యంగా ఉండి, పుకార్లకు భయపడకుండా సాధారణ వినియోగం కొనసాగించాలి.