India Fertility Rate Decline 2026: ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భారత్పై మరోసారి దృష్టి సారించారు. భారత్లో జనన రేటు రీప్లేస్మెంట్ లెవల్ కంటే తగ్గిపోయింది. చదువుకున్న, అత్యంత విద్యావంతులైన వర్గాల్లో ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతోంది అని హెచ్చరించారు. 2024లో విడుదలైన లేటెస్ట్ సాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) నివేదిక ప్రకారం భారతదేశ టోటల్ ఫర్టిలిటీ రేటు (టీఎఫ్ఆర్) 1.9కి పడిపోయింది. ఇది జనాభా స్థిరత్వానికి అవసరమైన 2.1 కంటే స్పష్టంగా తక్కువ.
ఒకప్పుడు జనాభా విస్పోటనం..
నాలుగైదు దశాబ్దాల క్రితం జనాభా గణనీయంగా పెరిగింది. ‘‘జనాభా బాంబు’’ అని ప్రపంచం భయపడిన భారత్ ఇప్పుడు జనాభా తగ్గుదల వైపు వేగంగా పయనిస్తోంది. ఇది మన సమాజం, ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్ రూపురేఖలను పూర్తిగా మార్చగల ఒక మహత్తరమైన మలుపు.
గతం నుంచి వర్తమానం వరకు…
1950–60లలో భారత్ ఫర్టిలిటీ రేటు 5.5 నుంచి 6 వరకు ఉండేది. అధిక మరణాల రేటు, వైద్య సదుపాయాల కొరత, వ్యవసాయ ఆధారిత జీవనం, ఉమ్మడి కుటుంబాలు, కుమారుడు సంతానం కోసం అనవసరమైన గర్భాలు ఇవన్నీ పెద్ద కుటుంబాలకు దోహదపడ్డాయి. పిల్లలు కుటుంబానికి శ్రమ బలం మాత్రమే కాకుండా, వృద్ధాప్యంలో భరోసా అని భావించారు. కానీ 1990ల నుంచి సమాజం వేగంగా మారింది. మహిళల విద్య, ఉద్యోగ అవకాశాలు, నగరీకరణ, పిల్లల పెంపకం ఖర్చులు (చదువు, ఆరోగ్యం, హౌసింగ్) ఇవన్నీ చిన్న కుటుంబాల వైపు మనస్తత్వాన్ని మార్చాయి. ‘‘ఒక్కడు/ఒక్కతే చాలు’’ అన్న భావన సామాన్యమైంది. ఫలితంగా 2024లో టీఎఫ్ఆర్ 1.9కు పడిపోయింది.
ఉత్తరాదిలో మెరుగు…
ఇక్కడే మనకు అసలు సవాలు కనిపిస్తుంది. దక్షిణాది మరియు పశ్చిమ రాష్ట్రాల్లో ఫర్టిలిటీ రేటు ఇప్పటికే చాలా తక్కువగా ఉంది (తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్లు 1.4–1.7 మధ్య ఉండగా, ఢిల్లీ వంటి నగరాలు 1.2 వరకు పడిపోయాయి. అయితే బీహార్ (2.9), ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ వంటి ఆరు రాష్ట్రాలు మాత్రమే ఇంకా రీప్లేస్మెంట్ లెవల్పై ఉన్నాయి. ఈ ప్రాంతీయ అసమానత భవిష్యత్తులో రాజకీయ, ఆర్థిక, సామాజిక ఉద్రిక్తతలకు దారితీయవచ్చు.
ఎలాన్ మస్క్ చెప్పిన చైనా సారూప్యత..
చైనా తన ‘‘ఒక్క పిల్లవాడు’’ విధానంతో యువ జనాభాను తగ్గించుకుంది. ఇప్పుడు అక్కడ వృద్ధుల సంఖ్య భారీగా పెరిగి, శ్రమ శక్తి తగ్గి, ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది. జపాన్, దక్షిణ కొరియా, రష్యా వంటి దేశాలు ఇప్పటికే ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. భారత్ కూడా అదే మార్గంలో నడుస్తుందని మస్క్ హెచ్చరిక. మన దేశంలో డెమోగ్రాఫిక్ డివిడెండ్ అన్న ఆశలు ఇక త్వరలో ముగియవచ్చు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడం, ఉద్యోగుల కొరత, పెన్షన్, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరగడం, ఒక తరం మరొక తరానికి సహాయం చేసే సామాజిక చక్రం దెబ్బతినడం ఇవన్నీ రాబోయే దశాబ్దాల్లో మన ముందు నిలబడతాయి. అయినా ఇది పూర్తి విపత్తు కాదు. ఈ తగ్గుదలను పూర్తిగా ప్రమాదంగా చూడకూడదు. ఇది మహిళల సాధికారత, విద్య, ఆర్థిక అభివృద్ధి, కుటుంబ నియంత్రణ అవగాహన వంటి సానుకూల మార్పుల ఫలితం. పిల్లల సంఖ్య తగ్గడం వల్ల ప్రతి పిల్లవాడికి మంచి పోషణ, విద్య, ఆరోగ్యం ఇవ్వడం సాధ్యపడుతోంది. గుణాత్మక జనాభా అన్న లక్ష్యం సాధ్యమవుతోంది.
భారత్ ఇప్పుడు ఒక చారిత్రక మలుపు వద్ద నిలబడి ఉంది. జనాభా పెరుగుదల సమస్య నుంచి జనాభా తగ్గుదల సవాలు వైపు మారుతోంది. ఇది భయపడాల్సిన విషయం కాదు, కానీ నిర్లక్ష్యం చేయాల్సిన విషయం కూడా కాదు. సమయం ఉంది. సరైన విధానాలు, సమగ్ర ఆలోచన, సమతుల్య దృక్పథంతో ఈ మార్పును అవకాశంగా మలచుకోగలిగితే మన భవిష్యత్ తరాలు మన్నించే దేశంగా మారవచ్చు. లేకపోతే, చైనా, జపాన్ మాదిరిగా ఆలస్యంగా బాధపడే దేశంగా మిగిలిపోవచ్చు. సమయం మన చేతిలో ఉంది. ఆలోచనలు మార్చుకునే సమయం ఇదే.
