Homeజాతీయ వార్తలు కరోనా సామూహిక వ్యాప్తిపై అలజడి 

 కరోనా సామూహిక వ్యాప్తిపై అలజడి 

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ (సామూహిక వ్యాప్తి) దశకు రాలేదని కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్ బలంగా వాదిస్తునప్పటికీ గత వారం రోజులుగా కొత్త కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో ఆ మేరకు ప్రభుత్వ వర్గాలలో భయం నెలకొన్నట్లు కనబడుతున్నది. అందుకనే మే 17 తర్వాత కూడా నాలుగో దశ లాక్ డౌన్ అమలు పరచనున్నప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

మరోవంక గత వారం రోజులుగా నమోదవుతోన్న వివరాల మేరకు ‘పాజిటివ్’గా నిర్ధారణ అవుతోన్న వాళ్లలో చాలా మందికి ప్రయాణ చరిత్ర లేకపోవడం సహితం ఆందోళన కలిగిస్తున్నది. దానితో మూడో దశలోకి ప్రవేశించడంపై వాస్తవం తెలుసుకొనేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)’ కమ్యూనిటీ ఆధారిత సర్వేను చేపట్టింది.

దేశంలోని 21 రాష్ట్రాల నుంచి ర్యాండంగా ఎంపిక చేసుకున్న 69 జిల్లాల్లో దశలవారీగా ఈ సర్వేను నిర్వహించనున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) సహకారంతో చేపట్టిన ఈ సర్వేకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారాన్ని కూడా తీసుకోనున్నారు.

ఈ సర్వేలో భాగంగా కొవిడ్-19 కేసుల నమోదును బట్టి ఆయా జిల్లాల్లోని 10 క్లస్టర్ల నుంచి 400 మందిని ర్యాండంగా ఎంపిక చేసి యాంటీబాడీ ర్యాపిడ్ టెస్టులు చేపడతారు. అందరూ 18 ఏళ్లు పైబడిన, మొత్తం 24 వేల మందికి పరీక్షలు చేసి వైరస్ వ్యాప్తి తీరుపై ఒక అంచనాకు వస్తారు. పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తయారుచేసిన తొలి స్వదేశీ టెస్టింగ్ కిట్స్ ద్వారా ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

లాక్ డౌన్ విధించి ఇప్పటికి యాభై రోజులు పూర్తయినా కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. మంగళవారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 70 వేలకు దాటగా, వారిలో 22,454 మంది వ్యాధి నుంచి కోలుకోగా, 2,293 మంది మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 46,008. సోమవారం రికార్డు స్థాయిలో నాలుగు వేల పైచిలుకు కొత్త కేసులు నమోదు కాగా… మంగళవారం కూడా కొత్తగా 3,604 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.
మరోవంక కేంద్ర ఆరోగ్య శాఖ నేతృత్వంలోని జనాభా ఆధారిత సెరో-సర్వే కూడా యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ఐసీఎంఆర్ తాజా సర్వే కోసం తెలంగాణలోని కామరెడ్డి, జనగామ, నల్గొండ జిల్లాలను, ఏపీ నుంచి కృష్ణా, నెల్లూరు, విజయనగరం జిల్లాలను ఎంపిక చేశారు. తుది ఫలితాలను బట్టి భారత్ స్టేజ్-3 లోకి ప్రవేశించిందీ, లేనిదీ నిర్ధారణ అవుతుందని ఐసీఎంఆర్ భావిస్తోంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version