నూరేళ్లు తోడుండాల్సిన భర్త పక్కదారి పట్టడంతో భార్య కన్నీరు మున్నీరు అయింది. ఎలాగైనా భర్తకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ లో చోటుచేసుకున్న సంఘటన విస్తుగొలుపుతోంది. మండల కేంద్రానికి చెందిన దంపతులు 25 సంవత్సరాలుగా కాపురం చేస్తున్నారు. వ్యసనాలకు బానిసైన భర్త నిత్యం భార్యను కొడుతుండేవాడు.
దీంతో అతడి వేధింపులు తాళలేక పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదే అదనుగా భావించిన అతడు మరో యువతిని తీసుకొచ్చి ఇంట్లోనే కాపురం పెట్టాడు. కట్టుకున్న భార్యను వదిలి పరాయి కాంతతో కులికాడు. దీంతో భార్య కుమిలిపోయింది. కంట తడి పెట్టుకుంది. అయినా తనలోని ధైర్యాన్ని కోల్పోలేదు. భర్త పరాయి మహిళతో కలిసి ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయింది.
మహిళలను వెంటబెట్టుకుని ఇంటికి చేరుకుని సదరు యువతి, భర్తను చితకబాదింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెకు మహిళా సంఘాలు మద్దతు పలికాయి. అనంతరం సదరు యువతిని అతడిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. అతడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేశారు.