BRS: బీఆర్‌ఎస్‌లో భయం మొదలైందా.. అదే ఓటమివైపు తీసుకెళ్తోందా?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొన్నాళ్లుగా జాతీయ రాజకీయాల్లో తన ముద్ర చూపించాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. తన గులాబీదళాన్ని జాతీయ పార్టీగా రూపుమార్చారు.

Written By: Raj Shekar, Updated On : November 20, 2023 3:50 pm
Follow us on

BRS: ఎన్నికల్లో విజయం సాధించే కళ.. ప్రచార పర్వంలోనే అర్థమైపోతుంది. ప్రచారంలో ప్రజలతో దగ్గరినుంచి మెలిగేప్పుడే.. వారి స్పందన నాయకులకు సరైన సంకేతాలను అందిస్తుంది. గెలుపు సంకేతాలు అందితే.. వారి ప్రవర్తన– ప్రసంగం యావత్తూ ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో సాగిపోతాయి. అదే సమయంలో.. ఓటమి సంకేతలు అందితే.. వారి మాటల్లో అణువణువునా భయం కనిపిస్తుంది.. రోజుకు నాలుగైదు సభల పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తున్న సుడిగాలి పర్యటనల్లో ఆయన మాటల్లో పుష్కలంగా భయం కనిపిస్తోంది. ఈ భయం ఎందుకు పుట్టింది? ఎటు దారితీయబోతోంది? బాస్‌లో భయమే పార్టీని ఓటమివైపు తీసుకెళ్తుదా అన్న టెన్షన్‌ గులాబీ శ్రేణుల్లో కనిపిస్తోంది.

జాతీయ రాజకీయాల్లో..
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొన్నాళ్లుగా జాతీయ రాజకీయాల్లో తన ముద్ర చూపించాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. తన గులాబీదళాన్ని జాతీయ పార్టీగా రూపుమార్చారు. ఇతర రాష్ట్రాలలో సభలు నిర్వహించి సమరనినాదాలు చేశారు. తను ఇష్టంగా ధరించే ‘పనామా హ్యాట్‌’ కు ఆకుపచ్చ రిబ్బను చుట్టి.. దాని మీద ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ అని ముద్రించి మరీ.. కేంద్రంలో అధికార మార్పు అవసరం ఉన్నదని తన వేషధారణ ద్వారా కూడా ప్రజల్లోకి సంకేతాలు పంపడానికి ఆయన ఉత్సాహపడ్డారు. పదేళ్ల మోడీ పాలనకు చరమగీతం పాడాలనే ఉబలాటాన్ని దేశవ్యాప్తంగా ప్రజల హృదయాల్లో నాటగలనని అనుకున్నాడు. అదే ఆలోచన తన సొంత రాష్ట్ర ప్రజల్లో కూడా వస్తుందని ఎందుకు ఊహించలేకపోయారో తెలియదు. ‘అగలీ బార్‌.. బదల్నా సర్కార్‌’ అనే నినాదం అప్రకటింతగా ప్రజలలో వ్యక్తం కాగలదనే అనుమానం ఆయనకు ఎందుకు రాలేదో తెలియదు. తెలంగాణలో అద్భుతాలు సృష్టించినట్టుగా ప్రచారం చేసుకుంటూ.. తెలంగాణ మోడల్‌ పాలననే దేశమంతా తీసుకువస్తాం అనే అందమైన మాటలను.. ఇతర రాష్ట్రాల్లో చెప్పుకోవడం బాగానే ఉంటుంది. కానీ.. ఆయన పాలన గురించి ఆయన అనుకుంటున్నంత ఘనంగా ప్రజలు అనుకుంటున్నారా? అనేది ఇక్కడ మిలియన్‌ డాలర్‌ ప్రశ్న!

అవినీతి దహిస్తోందా..
ప్రభుత్వ యంత్రాంగంలో విపరీతమైన అవినీతి తాండవిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు ఏ చిన్న పని కోసం వెళ్లినా సరే.. ప్రజలకు ప్రభుత్వ అవినీతి స్వయంగా స్వానుభవంలోకి వస్తున్నది. ప్రభుత్వం ద్వారా ఏ పనులు జరుగుతున్నా.. కొందరు మాత్రమే లబ్ధి పొందుతున్నారని.. ప్రభుత్వ పైరవీలు అనేవి కొందరికి మాత్రమే పరిమితం అవుతున్నాయనే వాదన పార్టీలో చాలా బలంగా ఉంది. ఒక కులానికి ప్రాధాన్యం అన్నట్టుగా కూడా కాకుండా.. కేవలం కొందరు వ్యక్తుల మాట మాత్రమే చెల్లుబాటు అయ్యే పరిస్థితి ఉన్నదనే అసంతృప్తి పార్టీ కింది స్థాయి నాయకుల్లో కూడా ఉంది. అయిదేళ్లపాటూ కింది స్థాయి నాయకులకు విలువ ఇవ్వకుండా, వారిని చులకనగా చూస్తూ.. ఎన్నికల వేళ వారిని ఎంతగా వాటేసుకున్నా సరే.. వారు ఎంత మాత్రం శ్రద్ధతో పనిచేయగలరు? అనేది ఒక కీలకాంశం.

అహంకారమే ప్రధాన శత్రువు
కల్వకుంట్ల తండ్రీకొడుకులు.. అహంకారానికి ముద్ర పడ్డారు. 2014లోనే వారికి విజయం పట్ల కాస్త సంశయం ఉండేది. ఎంతగా తాము తెలంగాణ నినాదాన్ని పట్టుకు వేలాడినా రాష్ట్రం ఇచ్చిన సోనియా మీద అభిమానంతో, కాంగ్రెసు పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తారనే భయం ఉండేది. అయినా సరే అధికారం దక్కింది. 2018 వ్యూహాత్మకంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కాంగ్రెసు పార్టీ నుంచి గెలిచిన వారినందరినీ కూడా ప్రలోభపెట్టి తమకు ప్రభుత్వానికి తగిన పూర్తి మెజారిటీ ఉన్నాసరే.. తమ జట్టులో కలిపేసుకున్నారు. తద్వారా కాంగ్రెసు పార్టీ మళ్లీ మళ్లీ తెలంగాణలో నిలదొక్కుకునే పరిస్థితి లేకుండా చేసేశామనే భావనకు వచ్చారు. 2018 ఎన్నికలలో వారికి అనూహ్యమైన మెజారిటీ లభించింది. 2014 కంటే ఎక్కువ స్థానాల్లో గెలవడంతో కల్వకుంట్ల తండ్రీకొడుకులకు అహంకారం ఎక్కువైంది. ఇందుకు నిదర్శనం మొదట హరీష్‌రావును లూప్‌లైన్‌లో పెట్టడం. కేసీఆర్‌ వారసుడిగా ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు? అనే విషయంలో హరీష్, కేటీఆర్‌ రెండు పేర్లు వినిపిస్తూ వచ్చాయి. ఈ పోటీ అనేది పార్టీమీద ప్రభావం చూపుతుందనే వాదన కూడా ఉండేది. అయితే కేసీఆర్‌ వ్యూహాత్మకంగా, అహంకారాన్ని అందించిన మెజారిటీ తరువాత, హరీష్‌రావుకు అసలు మంత్రి పదవి కూడా లేకుండా కొన్నాళ్లుంచారు. వారసత్వం విషయంలో సందిగ్ధాలు తొలగిపోయాయి. అన్ని రకాలుగానూ క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత తండ్రీ కొడుకుల అహంకారపూరిత వ్యవహార సరళి ఇంకా శృతిమించిందనే వాదన ఉంది. ముఖ్యమంత్రి అయితే అసలు మంత్రులకు కూడా అందుబాటులో ఉండని నాయకుడుగా అయిపోయారు. ఎమ్మెల్యేల సంగతి సరేసరి. తెలంగాణ రాష్ట్రానికి భౌగోళికంగా, వాతావరణం పరంగా ఉన్న అనేక అనుకూలతల దృష్ట్యా, ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఇక్కడకు కొన్ని పరిశ్రమలు, సంస్థలు ఎక్కువగా రావడం జరిగింది. అదంతా తమ ఘనతగా డప్పు కొట్టుకోవడంలో వీరు హద్దులు దాటారు. ఎంతటివారినైనా చులకనగా చూడడం, చులకనగా మాట్లాడడం వారికి ఒక అలవాటుగా మారిందనే వాదన పార్టీలోనే ఉంది.

ముఖ్యమైన మంత్రిగా కేటీఆర్‌..
ఇక తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ కొనసాగితే అనధికారిక ముఖ్యమంత్రిగా తెలంగాణలో మూడేళ్లుగా కేటీఆర్‌ కొనసాగుతున్నారు. అన్ని శాఖల్లో వేలు పెట్టడం, ఆయన చెబితేనే పనులు జరగడం పరిపాటైంది. ఎమ్మెల్యేలకు కూడా కేటీఆర్‌ అపాయింట్మెంట్‌ దొరకడం కూడా ఒక అద్భుతమైన సంగతిగా తయారైంది. మునిసిపల్‌ చైర్మన్లు స్థాయి వారికైతే.. అసలు అది మహాప్రసాదం. అంత ఈజీగా దొరికేదే కాదు. ఈ అహంకారం వారి ప్రవర్తనను కూడా పూర్తిగా మార్చేసింది. సూటిగా మాట్లాడుతున్నాం అనే ముసుగులో పొగరుగా మాట్లాడడం, వ్యవస్థలను లెక్క చేయకుండా.. తమను మించిన వారు ఎవరూ లేరన్నట్లుగా చెలరేగడం అలవాటు అయింది. ఈ అహంకారాన్ని కేవలం పార్టీలోని వారు మాత్రమే కాదు.. ప్రజలందరూ కూడా గమనిస్తూ వచ్చారు. మరి ఇన్నాళ్లు గమనించిన తీరుగురించి ఇప్పుడు ప్రజలు తీర్పు చెప్పే సందర్భం వచ్చింది. ఆ అహంకారం వారికి ప్రధాన శత్రువుగా పరిణమించిన వాతావరణం ఏర్పడింది.

పార్టీలు కనుమరుగవ్వడం కల..
గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాగేసుకుంటే.. ఒక పార్టీ పూర్తిగా సర్వనాశనం అయిపోతుందనే సిద్ధాంతం నిజమయ్యేట్లయితే గనుక.. ఏడున్నర దశాబ్దాలు దాటిన సుదీర్ఘ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పటికి కొన్ని వందల పార్టీలు కనుమరుగు అయిపోయి ఉండేవి. గెలిచిన తర్వాత.. కొందరు నాయకులు ప్రలోభాలకు భయాలకు గురికావొచ్చు గాక.. కానీ గెలుపోటములు అనేవి ప్రజలలో ఉండే ఆదరణ మీదనే ఆధారపడి ఉంటాయనేది నిజం. ఆ సత్యం ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ కు బోధపడే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ పార్టీనుంచి గెలిచిన వారిని బీఆర్‌ఎస్‌లో కలిపేసుకుని మురిసిపోయిన సందర్భంలో.. ఆ కాలవ్యవధిలో కాంగ్రెస్‌ బలహీన పడినట్టుగా తయారై ఉండొచ్చు గాక. కానీ.. ఎన్నికలు సమీపించే సమయానికి ఆ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది.

కాంగ్రెస్‌లో ఐక్యతారాగం..
కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న ప్రధానమైన బలహీనత.. ఐక్యతాలోపం. ముఠా తగాదాలు, గ్రూపుల మధ్య విభేదాలు, ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకోవడం లాంటివి. కానీ ఈ సారి ఎన్నికలకు సిద్ధం కావడంలో వారు చాలా జాగ్రత్త పడ్డారు. ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే తొలి సన్నాహక సమావేశంలోనే.. ముఠా తగాదాల పరంగా రాహుల్‌ గాంధీ వారికి చాలా స్పష్టమైన హెచ్చరికలు జారీచేశారు. పార్టీ నాయకులకు కూడా వాస్తవాలు అర్థమయ్యాయి. ఈ ఎన్నికల్లో పార్టీని సమష్టిగా గెలిపించుకోలేకపోతే.. ఇక ఎప్పటికీ తిరిగి లేవలేనంతగా పార్టీ కుదేలైపోతుందని వారు భయపడ్డారు. అందుకే సమైక్య గానం ఆలపించారు. నాయకుల మధ్య సయోధ్య కనబడుతూ వచ్చింది. అభ్యర్థిత్వాల ప్రకటన తర్వాత.. చాలా సహజంగా అసంతృప్తులు మళ్లీ రేగాయి. చాలా చోట్ల తిరుగుబాటు అభ్యర్థుల నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. అయితే.. కేవలం సర్వేల మీద ఆధారపడి మాత్రమే అభ్యర్థిత్వాలను ఎంపిక చేస్తున్నట్టుగా తొలినుంచి చెబుతూ వచ్చిన కాంగ్రెస్‌ పెద్దలు.. తిరుగుబాటు చేస్తున్న వారిని బుజ్జగించడంలో సఫలం అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే.. అలా తిరుగుబాటు ప్రకటించిన వారికి కూడా గత్యంతరం లేదు.

కాంగ్రెస్‌ వేదికగా ఒక్కటై..
తెలంగాణలో కేసీఆర్‌ ను బలంగా వ్యతిరేకించే ప్రతి నాయకుడికి ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే దిక్కుగా మారిందనడంలో సందేహం లేదు. తెలంగాణలో పోటీ విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక డ్రామా నడిపించింది. తుట్టతుదకు కాంగ్రెసుకు మేలు చేసే లోపాయికారీ ఒప్పందంతో పోటీనుంచి పూర్తిగా తప్పుకునేలా చంద్రబాబునాయుడు జైలునుంచే డైరక్షన్‌ చేశారు. దానివలన కాసాని జ్ఞానేశ్వర్‌ వెళ్లిపోవడం మినహా పార్టీకి పెద్దగా నష్టం జరగలేదు. కాకపోతే.. తెలుగుదేశం కాంగ్రెసు కోసమే ఈ నాటకం ఆడిందన్నది స్పష్టం. టీడీపీ మాత్రమే కాదు.. తెలంగాణలోని కేసీఆర్‌ వ్యతిరేకత ఉన్న సీరియస్‌ శక్తులన్నింటినీ.. కాంగ్రెసు అనుకూలంగా మార్చడంలో ఆ పార్టీ సక్సెస్‌ అయింది. ప్రొఫెసర్‌ కోదండరాం, వైఎస్‌ షర్మిల పోటీనుంచి తమ పార్టీలను పూర్తిగా తప్పించి.. కాంగ్రెసుకు మద్దతు ప్రకటిస్తున్నామని.. కేసీఆర్‌ పతనం రాష్ట్రానికి అవసరమని నినాదాలు చేశారు. ఇక పోతే వారందరూ కూడా.. కాంగ్రెసుకు అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో అంతే సీరియస్‌ గా తిరిగితే కాస్త ఫలితం ఉంటుందనే అభిప్రాయం కూడా ఉంది.

బీజేపీ బీఆర్‌ఎస్‌ ఒక్కటే అన్న భావన..
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, భారాసతో కుమ్మక్కు రాజకీయాలు నడుపుతోందనే ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు యావత్తూ నమ్ముతున్నారు. ఆ రెండు పార్టీల మధ్య క్విడ్‌ ప్రోకో నడుస్తున్నదని ప్రజల సందేహం. దేశంలో కీలక ప్రాంతాల్లో మోదీ వ్యతిరేక ఓటును చీల్చడానికి కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ను స్థాపిస్తే.. తెలంగాణలో కేసీఆర్‌ వ్యతిరేక ఓటును చీల్చడానికి బీజేపీ ఉపయోగపడుతున్నదనే వాదన ప్రజల్లోకి వెళ్లింది.