కోవిడ్ పై ప్రతిపక్షాలను కడిగేసిన బీజేపీ ఎంపీ

బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహరావు బీజేపీపై విమర్శలు చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. మోడీని టార్గెట్ చేసి విమర్శిస్తున్న వారికి జవాబిచ్చారు. ఈ సందర్భంగా కేంద్రం అప్రమత్తంగా లేదని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. కరోనా ప్రమాదం ఉన్నప్పుడు ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏముందని కొందరు అంటున్నారని.. ఎన్నికలు పెట్టొద్దన్ని ఏ రాజకీయ పార్టీ అయినా మాట్లాడిందా? అని ప్రశ్నించారు. ఎన్నికలు వద్దని బెంగాల్‌లో టీఎంసీ చెప్పిందా? కేరళలో సీపీఐ(ఎం) చెప్పిందా? అన్ని […]

Written By: NARESH, Updated On : May 22, 2021 8:34 pm
Follow us on

బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహరావు బీజేపీపై విమర్శలు చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. మోడీని టార్గెట్ చేసి విమర్శిస్తున్న వారికి జవాబిచ్చారు. ఈ సందర్భంగా కేంద్రం అప్రమత్తంగా లేదని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. కరోనా ప్రమాదం ఉన్నప్పుడు ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏముందని కొందరు అంటున్నారని.. ఎన్నికలు పెట్టొద్దన్ని ఏ రాజకీయ పార్టీ అయినా మాట్లాడిందా? అని ప్రశ్నించారు. ఎన్నికలు వద్దని బెంగాల్‌లో టీఎంసీ చెప్పిందా? కేరళలో సీపీఐ(ఎం) చెప్పిందా? అన్ని రాష్ట్రాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ చెప్పిందా? అని జీవిఎల్ నిలదీశారు.

కోర్టులు కూడా వ్యాఖ్యానాలు చేశాయని.. కానీ ఏ కోర్టైనా ఎన్నికలు వద్దని చెప్పిందా? ఎవరైనా కోర్టుల్లో పిల్ దాఖలు చేశారా? అని జీవీఎల్ విమర్శలు చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. అనేక రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుంటే వాటిని ఆపాలని ఏ పార్టీ అయినా డిమాండ్ చేసిందా? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థలు వాయిదా వేస్తామని యూపీ సర్కారు చెబితే, అలహాబాద్ హైకోర్టు ఒప్పుకోలేదని.. ఎన్నికలు జరిపి తీరాల్సిందే అని ఆదేశించాయన్నారు. కేవలం రాజకీయాల కోసం మోదీని అప్రతిష్టపాలు చేయడం కోసం మాత్రమే ఆరోపణలు చేస్తున్నారన్నారు.

మార్చి 17న ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలోనే కరోనా ముప్పు తొలగిపోలేదని ప్రధాని మోదీ అన్నారని జీవీఎల్ తెలిపారు. గ్రామాల్లోకి విస్తరించే ప్రమాదం ఉందని, కంటైన్మెంట్ కఠినతరం చేయాలని అప్పుడే చెప్పారని వివరించారు.

ప్రపంచంలో నాలుగైదు దేశాలు మాత్రమే వ్యాక్సిన్లు తయారు చేశాయి. అమెరికా, చైనా, రష్యా, యూకే, ఇండియా వంటి దేశాలు మాత్రమే వ్యాక్సిన్లు తయారు చేశాయని జీవీఎల్ తెలిపారు. ఇప్పుడు వ్యాక్సిన్లు అందరికీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు, గతంలో ఏమన్నారో గుర్తుచేసుకోండని కౌంటర్ ఇచ్చారు. ‘కోవాగ్జిన్’కి అత్యవసర అనుమతులు ఇవ్వడం ప్రమాదకరమని.. ఎలా అనుమతులు ఇస్తారని నానా రాద్ధాంతం చేశారని గుర్తు చేశారు. అఖిలేష్ యాదవ్ ‘కోవాగ్జిన్’ని బీజేపీ వ్యాక్సిన్ అని, దీన్నెవరూ వేసుకోవద్దని చేసిన వ్యాఖ్యలు మర్చిపోయారా? అని ప్రశ్నించారు. వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా, చులకనగా మాట్లాడిన సిగ్గులేని రాజకీయ పార్టీలు ఇప్పుడు విమర్శలు చేస్తున్నాయి

9 నెలల లోపే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే చెందుతుందని జీవీఎల్ తెలిపారు. నిజానికి ‘ఆరోగ్యం’ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశం. అయినప్పటికీ కేంద్రం చొరవ తీసుకుని ముందుకొచ్చిందన్నారు. రాష్ట్రాలు స్వయంగా వ్యాక్సిన్లను ఎందుకు సమీకరించుకోలేకపోతున్నాయి? సమాధానం రాష్ట్రాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ జనాభాతో సరిపడినంత ఉన్న దేశాలతో భారత్‌ను పోల్చి చూడడం సరికాదన్నారు. ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే భారత్‌లో కరోనా మరణాల రేటు చాలా చాలా తక్కువ అన్నారు. మన దేశం కంటే ఆరోగ్య మౌలిక వసతులు మెరుగ్గా ఉన్న దేశాల్లోనే అధిక మరణాల రేటు నమోదైంది

-ఏపీకి ఎంతో ఇచ్చాం.. నిర్లక్ష్యం చేస్తున్నారు: జీవీఎల్
దేశంలో పంపిణీ జరిగిన ప్రతి 7 వెంటిలేటర్లలో ఒకటి ఏపీకి దక్కిందని జీవీఎల్ నరసింహరావు తెలిపారు. రాష్ట్రంలో చాలా చోట్ల వెంటిలేటర్లను సరిగా ఉపయోగించడం లేదని సమాచారం ఉందన్నారు. కేసుల్లో ఏపీ 5వ స్థానంలో, మరణాల్లో 9వ స్థానంలో ఉందన్నారు. ఇంత దారుణ పరిస్థితి ఏపీలో ఎందుకు నెలకొంది? అని ప్రశ్నించారు. నవరత్నాల పేరుతో గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. ఏపీలో సరైన సంఖ్యలో టెస్టులు లేవు, ప్రభుత్వాసుపత్రుల్లో అధ్వాన్నంగా పరిస్థితి ఉందన్నారు. గత ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైద్య మౌలిక వసతులను ఎందుకు మెరుగుపర్చలేకపోయింది? అని ప్రశ్నించారు.

వ్యాక్సినేషన్ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని జగన్ సర్కార్ ను జీవీఎల్ విమర్శించారు. మాస్కు ధరించడం వంటి కోవిడ్ బిహేవియర్ రాష్ట్ర సీఎం, మంత్రులు ఎవరూ పాటించడం లేదన్నారు. వారికి కోవిడ్ భయం లేదా? లేక కోవిడ్ వైసీపీకి ప్రత్యేక మినహాయింపునిచ్చిందా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జనానికి ఇచ్చే సందేశం ఏంటి? ఏం సంకేతాలు పంపుతున్నారు? అని నిలదీశారు.

ఏపీ సర్కారు బడ్జెట్లో పెట్టిన మొత్తం కంటే అదనంగా రూ. 2-3 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామని జీవీఎల్ తెలిపారు. గత ఏడాది ప్రారంభంలో రాష్ట్రాలకు కరోనా కట్టడి అనుభవం లేదు కాబట్టి కేంద్రమే రంగంలోకి దిగి లాక్‌డౌన్ విధించిందన్నారు. గత ఏడాది చివరి నుంచే ఆరోగ్యం రాష్ట్రాల పరిధిలో ఉన్నందున, రాష్ట్రాలకే సాధికారత అప్పగించామన్నారు. అందుకే ఈ ఏడాది లాక్‌డౌన్ విధించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకే కల్పించి, తద్వారా కరోనా కట్టడికి సహకరిస్తున్నామన్నారు. గత ఏడాది లాక్‌డౌన్ విధిస్తే తప్పుబట్టారు. ఈ ఏడాది మళ్లీ వారే (రాహుల్ గాంధీ) ఎందుకు విధించడం లేదని ప్రశ్నిస్తున్నారని ప్రతిపక్షాన్ని నిలదీశారు.