Homeజాతీయ వార్తలుGujarath CM Bupendra patel: గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ను ఎందుకు నియమించారు..?

Gujarath CM Bupendra patel: గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ను ఎందుకు నియమించారు..?

Gujarath CM Bupendra patel: 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తరువాత విజయ్ రూపానీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సాధారణ కార్యకర్తగా ఉన్న ఆయనను ఏకంగా సీఎం సీట్లో కూర్చోబెట్టడంతో అంతా షాక్ తిన్నారు. అయితే త్వరలో గుజరాత్లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఊహించని విధంగా విజయ్ రూపానీ ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పుకున్నారు. ఆ భాధ్యతలను భూపేంద్ర పటేల్ కు అప్పగించారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడైన విజయ్ రూపానీ తన పదవిని భూపేంద్ర పటేల్ కు ఎందుకు అప్పగించారు..? గుజరాత్ లో జరుగుతున్న పరిణామాలేంటి..?

భూపేంద్ర పటేల్ మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేనే. అయినా ఆయనకు ఏకంగా సీఎం పదవి వరించింది. అహ్మదాబాద్లోని ఘట్లోడియా నియోజకవర్గం నుంచి భూపేంద్ర పటేల్ ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి గతంలో ఆనందీబెన్ పటేల్ ఎన్నికయ్యారు. ఆమెకు గవర్నర్ బాధ్యతలు అప్పగించడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంత భూపేంద్ర పటేల్ పోటీ చేసి గెలుపొందారు. భూపేంద్ర పటేల్ గతంలో ఘట్లోడియా మున్సిపాలిటీ చైర్మన్ గా పనిచేశారు. అహ్మదాబాద్ అభివృద్ధి అథారిటీ చైర్మన్ గా కూడా పనిచేశారు.

గుజరాత్ లో 182 నియోజకవర్గాలున్నాయి. వీటిలో 71 నియోజకవర్గాల్లో పటీదార్లే(పటేల్ సామాజికవర్గం) ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర జనాభాలోనూ పటీదార్లు 15 శాతం ఉన్నారు. 2022లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పటీదారి సామాజిక వర్గానికి చెందిన భూపేంద్ర పటేల్ ను సీఎం సీట్లో కూర్చొబెట్టినట్లు తెలుస్తోంది. గతంలో రిజర్వేషన్ల కోసం చేసిన ఆందోళనతో ఆనందీ బెన్ పటేల్ ను సీఎం పదవి నుంచి తప్పించారు. ఆ తరువాత సీఎం అభ్యర్థిగా చాలా పేర్లు వినిపించాయి. కానీ నరేంద్రమోడీ సన్నిహితుడైన విజయ్ రూపానీ పేరు ఖరారు చేశారు. ఇప్పుడు ఆయన స్థానంలో భూపేంద్ర పటేల్ నియామకమయ్యారు.

తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించినందుకు ఎలాంటి అసంతృప్తి లేదని విజయ్ రూపానీ తెలిపారు. ఈ మేరకు ఆయన గవర్నర్ కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘సాధారణ కార్యకర్తగా ఉన్న తనని సీఎం సీట్లో కూర్చోబెట్టిన పార్టీ అధిష్టానానికి థ్యాంక్స్ చెప్పారు. అలాగే కొత్త నాయకత్వంలో గుజరాత్ అభివృద్ధి ప్రయాణం సాగాలి’ అని అన్నారు.

త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి పటీదార్ల రిజర్వేషన్ల వివాదం ముందుకొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నిరసన కాకుండా ఉంచేందుకు అధిష్ఠానం ఆ సామాజిక వర్గానికి చెందిన భూపేంద్ర పటేల్ ను సీఎం సీట్లో కూర్చొబెట్టినట్లు తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో పటీదార్లను కాదని మిగతా వర్గాలను సంతోషపెట్టడానికి విజయ్ రూపానీని నియమించారు. ఇప్పుడు పటీదార్లు రిజర్వేషన్ కోసం మరోసారి ఆందోళనలు చేయనున్నారని తెలియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా విజయ్ రూపానీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించినా ఓట్లు రాబట్టడంలో వెనకబడి ఉన్నారు. 2012లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 115 స్థానాలను గెలుచుకుంది. అదే 2017లో విజయ్ రూపానీ సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగగా ఆ సంఖ్య 99కి పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2022లో జరిగే ఎన్నికల్లో మరోసారి సీట్ల సంఖ్య తక్కువ కాకుండా ఉండేందుకు భూపేంద్ర పటేల్ ను తెరపైకి తెచ్చారు. ఇప్పటి వరకు బీజేపీ ఐదు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చింది. కర్ణాటకలో బీఎస్ యడ్యూరప్ప, ఉత్తరాఖండ్లో తీరథ్ సింగ్ రావత్, త్రివేంద్ర సింగ్ రావత్, అసోంలో శర్బానంద్ సోనోవాల్ లను తమ పదవుల నుంచి తప్పించింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version