Governor Tamilisai Vs KCR: తెలంగాణలో ఏడాదిన్నరగా గవర్నర్, గవర్నమెంట్ మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధ.. రి‘పబ్లిక్’గా ముదురు పాకాన పడినట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ ఎవరికి వారు విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ గణతంత్ర వేడుకల సాక్షిగా గవర్నర్ తమిళిసై కేసీఆర్ టార్గెట్గా విమర్శలు చేశారు. భవనాల నిర్మాణం అభివృద్ధికి నిరద్శనం కాదని, జాతి నిర్మాణం ముఖ్యమని కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు. ఫామ్ ౖహె స్ల గురించి ప్రస్తావించారు. అందరికీ ఫామ్, హౌస్ కావాలని ఆకాంక్షించారు. అంతటితో ఆగకుండా తెలంగాణలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనపై కేంద్రానికి నివేదిక పంపించానని ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఎన్నికల బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వేళ.. గవర్నర్ తీరు కేసీఆర్కు కొరకరాని కొయ్యలా మారింది.

బీజేపీ ప్రతినిధిగా ముద్రవేసి..
తెలంగాణ గవర్నర్గా తమిళిసై బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమెను బీజేపీ ప్రతినిధిగా ముద్ర వేసింది తెలంగాణ ప్రభుత్వం. గవర్నర్ ప్రమేయం లేకుండా తన పని తాను చేసుకుపోతుంది. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని గవర్నర్ తమిళిసై ఇప్పటికే అనేకమార్లు మీడియా సాక్షిగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలోనూ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితిని కేంద్రానికి నేరుగా వెళ్లి మరీ వివరించి వచ్చారు. తాజాగా రాజ్యాంగ ఉల్లంఘనపై నివేదిక ఇవ్వడం చర్చనీయాంశమైంది.
రాజ్భవన్ వర్సెస్ ప్రగతి భవన్..
ఇక ప్రస్తుతం కూడా రిపబ్లిక్ డే వేడుకలు ప్రభుత్వం నిర్వహించకపోవడం, హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతోపాటుగా, గవర్నర్ను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉండడం వెరసి తెలంగాణలో ప్రగతిభవన్, రాజ్భవన్ గ్యాప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రసంగంలోనూ గవర్నర్ తమిళిసై తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను కొంతమందికి నచ్చకపోవచ్చు అంటూ పేర్కొన్న ఆమె తెలంగాణ ప్రజలు అంటే తనకు ఇష్టమని, వారి కోసం ఎంత కష్టమైనా భరిస్తానంటూ తేల్చి చెప్పారు.
బీఆర్ఎస్ సభకు లేని కోవిడ్.. గణతంత్ర వేడుకలకెలా..
తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని గవర్నర్ తమిళిసై అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని గవర్నర్ తమిళిసై ప్రకటించారు. తెలంగాణలో జెండా ఆవిష్కరణ తరువాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న తమిళి సై పుదుచ్చేరికి వెళ్లారు. అక్కడ కూడా ఆమె కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి పేరుతో గణతంత్ర వేడుకలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని పేర్కొన్న ఆమె ఖమ్మం జిల్లాలో కేసీఆర్ ఐదు లక్షల మందితో సభ నిర్వహించారని గుర్తు చేశారు. ఇక ఈ విషయాలు అన్నింటిపై కేంద్రానికి తాను నివేదిక పంపించానని ప్రకటించారు.

కేంద్రం సీరియస్గా తీసుకుంటుందా?
ఇప్పటికే అనేక పర్యాయాలు గవర్నర్ తమిళిసై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు తాజాగా మరో మారు తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన గురించి కేంద్రానికి నివేదిక పంపించాను అని చెప్పడం ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. మరి గవర్నర్ తమిళి సై పంపించిన నివేదికలను కేంద్రం సీరియస్ గా తీసుకుంటుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఏది ఏమైనా తాజాగా రిపబ్లిక్ డే వేడుకల సాక్షిగా గవర్నర్ తమిళిసై వర్సెస్ సీఎం కేసీఆర్ మరోమారు రగడ కొనసాగుతుండడంతో ఈ వ్యవహారంలో ఏం జరగబోతుంది అన్న ఆసక్తి అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ప్రజల్లో నెలకొంది.
రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేశారా? చర్చ
ఒకవేళ ఈ వ్యవహారంలో కేంద్రం సీరియస్ గా తీసుకుంటే పరిణామాలు చాలా ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. తెలంగాణాలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేశారా? అన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది. ఏది ఏమైనా చిలికి చిలికి గాలివానగా మారుతున్న ఈ వివాదానికి కేంద్రం ఫుల్ స్టాప్ పెడుతుందా? లేకా ఇది ఇలాగే కొనసాగుతుందా? అన్నది తెలియాల్సి ఉంది.