Gone Prakash Rao: తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గోనె ప్రకాశ్రావు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో యాక్టీవ్గా లేడు. అయినా.. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి రాజకీయాలు మాట్లాడుతుంటాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ చైర్మన్గా పనిచేసిన గోనె ఒకప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డికి వీర విదేయుడు. ఇప్పుడు ఏమయిందో తెలియదు కానీ, ఆ ఇంట్లోని గుట్టు రట్టు చేస్తున్నాడు. పనిగట్టుకుని మరీ మీడియా ముందుకు వచ్చి.. అవసరం లేకున్నా వైఎస్ కుటుంబం గురించే మాట్లాడుతున్నారు.
షర్మిల, జగన్ మధ్య విభేదాలు అంటూ..
తాజాగా మరోసారి ఆయన మీడియా ముందుకు వచ్చారు. వైఎస్ జగన్, షర్మిల మధ్య ఉన్న విబేధాల గురించి మాట్లాడారు. షర్మిలపై జగన్కు చాలా కోపం ఉందని.. కొన్ని ఉదాహరణలు చెప్పారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్న తర్వాత ఏపీ నుంచి ఓ సిట్టింగ్ ఎంపీ వచ్చి షర్మిలను కలిశారని చెప్పారు. పార్టీ పెట్టుకున్నందున చాలా ఖర్చులు ఉంటాయని తాను రూ.5 కోట్లు ఆర్థిక సాయం చేస్తానని హమీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం తెలిసిన జగన్మోహన్రెడ్డి ఆ ఎంపీని పిలిచి తీవ్రంగా మందలించారని గోనె ప్రకాశ్రావు వెల్లడించారు. ఎందుకు ఆర్థిక సాయం చేస్తానని వెళ్లావని మండిపడ్డారట అని తెలిపారు.
అవినాష్రెడ్డి అరెస్ట్ తప్పదు..
ఇక, వైఎస్.వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ వైఎస్.అవినాష్రెడ్డి రెండు రోజుల్లో అరెస్ట్ అవుతారని గోనె ప్రకాశ్రావు జోస్యం చెబుతున్నారు. ఇలాంటి మాటలతో పాటు ఆయన సర్వేలూ చేస్తున్నారు. ఆయన ఏ సర్వేల గురించి చెబుతున్నారో కానీ .. ఒకప్పుడు తన రాజకీయ దైవం అయిన రాజశేఖరరెడ్డి కుమారుడి గురించి మాట్లాడటం లేదు. టీడీపీ గెలుస్తుందని ఆయన చెబుతున్నారు. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే వంద సీట్లు.. జనసేనతో కలిసి పోటీ చేస్తే 150 సీట్లు వస్తాయని చెబుతున్నారు.
యూట్యూబ్ చానెళ్లకు ఇంటర్వ్యూ..
గోనె ప్రకాశ్రావు మంచి వాగ్ధాటి ఉన్న నేత కావడం, తెలుగు రాష్ట్రాలకు చెందిన పెద్ద నాయకులతో చాలాకాలం ఆయన సాన్నిత్యం ఉండడంతో యూట్యూబ్ చానళ్లు మంచి ప్రయారిటీ ఇస్తున్నాయి. పిలిచి మరీ ఇంటర్వ్యూ చేస్తున్నాయి. కొన్నేళ్లు రాజకీయాలతోపాటు, భౌతికంగా కూడా కనిపించకుండా పోయిన గోనె కొన్నేళ్లుగా మళ్లీ మీడియాలో కనిపిస్తున్నారు. తాజాగా రాజకీయాలపై దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో బీఆర్ఎస్, కేసీఆర్తోపాటు, కాంగ్రెస్పై మాట్లాడుతున్నారు. ఆంధ్రాల్లో అధికార వైసీపీ, టీడీపీపై సర్వేలు చేస్తున్నారు. తెలంగాణలోనూ ఉప ఎన్నికల సమయంలో జోష్యం చెప్పారు. అంచనాలు వెల్లడించారు.