దక్షిణ మధ్య రైల్వేలో ఐదు ప్రైవేట్ రైళ్ల రాకపోకలు జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా వంద మార్గాల్లో 150 ప్రైవేట్ ప్యాసింజర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో డిమాండ్ ఉన్న పలు రైలు మార్గాల్లో ప్రైవేట్ రైళ్లకు అవకాశం కల్పిస్తున్నారు.
ప్రస్తుతం ఢిల్లీ – లక్నో మధ్య తేజస్ ప్రైవేట్ రైళ్లు విజయవంతంగా రాకపోకలు సాగిస్తున్నాయి. రెండో ప్రైవేట్ రైలు అహ్మదాబాద్- ముంబై మార్గంలో జనవరి 19 నుంచి అందుబాటులోకి వచ్చింది. రూ 22, 500 కోట్ల పెట్టుబడితో దేశంలోని వంద మార్గాల్లో 150 రైళ్లను ప్రైవేటు ఆపరేటర్లు నడపనున్నట్లు రైల్వే ప్రకటించింది. వీటిలో సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఎపి కి సంబంధించి అయిదు రూట్లు ఉన్నాయి.
ప్రైవేట్ రైళ్లలో సకల సౌకర్యాలుంటాయని.. విమానాల తరహాలో అత్యంత ఖరీదైన వసతులతో పాటు రైల్ హోస్టెస్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల డిమాండ్ అధికంగా ఉన్న రూట్లనే ప్రైవేటు రైళ్లకు ఎంపిక చేశారు.
చర్లపల్లి – శ్రీకాకుళం, లింగంపల్లి – తిరుపతి, గుంటూరు – లింగంపల్లిల మధ్య డైలీ ట్రైన్లు నడపనున్నారు. ఇక విజయవాడ – విశాఖతో పాటూ, విశాఖ – తిరుపతి మధ్య ట్రై వీక్లీ ప్రైవేట్ రైళ్లు నడిపేందుకు మార్గం సుగమమయింది.ప్రైవేటు రైళ్లలో డ్రైవరు, గార్డులను రైల్వే శాఖ అందిస్తుంది.
ప్రమాదాలు జరిగితే సహాయ చర్యలు, బీమాతో పాటూ మిగిలిన సౌకర్యాల బాధ్యత మొత్తం ప్రైవేటు ఆపరేటర్లదే. రైల్వేల్లో పెట్టుబడి కోసం విదేశీ సంస్థలపైన హ్యూండారు, సీమెన్స్, ఆల్స్ట్రామ్ ఆసక్తి కనబరుస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. దేశీయ సంస్థలైన టాటా, అదానీ గ్రూప్లు కూడా ప్రైవేటు రైళ్ల వైపు అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది