దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన తబ్లిగి జమాత్ కార్యక్రమ నిర్వాహకుల పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. వెంటనే స్పందించిన అధికారులు కార్యక్రమ నిర్వాహకులైన మౌలానా సాద్ తదితరులపై ‘అంటువ్యాధుల చట్టం 1897’ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మార్చి 13,14,15 తేదీలలో నిజాముద్దీన్ కార్యక్రమానికి హాజరైన వారిలో 24 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఈ మర్కాజ్ కు హాజరైన 12 మంది విదేశీయులు సమాచారాన్ని దాచి ఉంచినందుకు జామా మసీదు వజీరాబాద్ ఇమామ్ పై కూడా కేసు నమోదు చేశారు.
అక్కడి ఉన్నవారిని తరలించేందుకు తొలుత నిర్వాహకుడు మౌలాన సాద్ సహకరించకపోవడంతో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డొభాల్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆయన మార్చి 28వ తేదీ అర్ధరాత్రి రంగంలోకి దిగి అక్కడి మౌలానను ఒప్పించారు. దీంతో అక్కడి వారి తరలింపు మొదలైంది. వీరిలో చాలా మంది వీసా నిబంధనలను ఉల్లంఘించి ఇక్కడకు వచ్చినట్లు తేలింది.
ఈ సమావేశానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరై ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఒక్క మంగళవారమే 146 కొత్త కేసుల నమోదుతో భారత్ లో కరోనా కేసులు 1397కు ఎగబాకాయి. ఇప్పటి వరకు 35 మంది కొవిడ్-19 సోకి మరణించగా.. 123 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయినట్టు అధికారులు తెలిపారు.