ఆర్ధిక సంక్షోభంలో అట్టడుగు స్థాయికి కృష్ణ, గుంటూరు

డిసెంబరు 17, 2019న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తీవ్ర ఆర్ధిక సంక్షోభకర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పూర్తిగా స్తంభించి పోవడంతో పలు రంగాలలో ఆర్ధిక వ్యవహారాలు సహితం నిలిచి పోయాయి. ఈ రెండు జిల్లాల్లో స్థలాలు, పొలాలు, అపార్టుమెంట్ల క్రయవిక్రయాలు నిలిచిపోవడంతో వ్యాపారులు, నిర్మాణదారులు, రియల్‌ ఎస్టేట్‌ దళారులు, భూముల యజమానులు మరింత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. గత ఆరు […]

Written By: Neelambaram, Updated On : February 20, 2020 3:32 pm
Follow us on


డిసెంబరు 17, 2019న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తీవ్ర ఆర్ధిక సంక్షోభకర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పూర్తిగా స్తంభించి పోవడంతో పలు రంగాలలో ఆర్ధిక వ్యవహారాలు సహితం నిలిచి పోయాయి.

ఈ రెండు జిల్లాల్లో స్థలాలు, పొలాలు, అపార్టుమెంట్ల క్రయవిక్రయాలు నిలిచిపోవడంతో వ్యాపారులు, నిర్మాణదారులు, రియల్‌ ఎస్టేట్‌ దళారులు, భూముల యజమానులు మరింత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. గత ఆరు నెలలుగా వివిధ రంగాల్లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం ప్రభావంతో సామాన్యుల నుంచి ఎగువ తరగతి వరకూ నగదు చలామణి లేక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.

ఈ తరుణంలో తాజాగా రాజధాని మారనున్నట్లు వచ్చిన ప్రభుత్వ ప్రకటనతో ఈ జిల్లాల ప్రజలల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది.
రాజధాని జిల్లాలో తమకు ఒక స్థలం ఉండాలనే ఆకాంక్షతో ఇతర జిల్లాల వారు గత ఐదేళ్ల కాలంలో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశారు. మంచి ధర ఉన్నప్పుడు విక్రయించవచ్చని చాలా మంది భావించారు. ప్రస్తుతం వీరంతా తీవ్ర నిరాశలో ఉన్నారు.

అమరావతి పరిధిలోని నిర్మాణాలు నిలిచిపోవడంతో రాజధానిలోని 29 గ్రామాల్లో ఆరు నెలలుగా భూమి క్రయ విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. తుళ్లూరు జిల్లా రిజిస్ట్రార్‌, అనంతవరం, మందడం, తుళ్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ల పరిధిలో కనీసం రోజుకు ఒక్క రిజిస్ట్రేషన్‌ అయినా జరగడం లేదు.

గుంటూరు జిల్లాలో 2019-20లో మొత్తంగా రూ.1003 కోట్ల ఆదాయం సాధించాలని జిల్లా రిజిస్ట్రేషన్‌ శాఖకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటి వరకూ వచ్చిన ఆదాయం రూ.610 కోట్లే. మరో 45 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది.

భూముల ధరలు మార్కెట్‌లో 2019 ఎన్నికల ముందున్న దానికంటే ఈ ఏడాది 30 నుంచి 50 శాతం వరకూ పడిపోయాయి. గుంటూరు-విజయవాడ మార్గంలో నిర్మించిన దాదాపు 20 వేల అపార్టుమెంటు ప్లాట్ల విక్రయాలు నిలిచిపోయాయి. గుంటూరు నగర పరిసరాల్లో దాదాపు ఆరువేల వేల ప్లాట్లను కోనేవారు లేక బిల్డర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.