Jagan- Sharmila: ఏపీ పాలిటిక్స్ లోకి షర్మిల ఎంట్రీ ఇవ్వనున్నారా? అన్న జగన్ ను ఢీకొట్టనున్నారా? అదే జరిగితే తల్లి విజయలక్ష్మి సపోర్ట్ ఎటు? ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. తెలంగాణలో వైయస్సార్ టిపి పార్టీని షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేస్తారన్న ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే దానికి ఇప్పుడు ఒక తుది రూపం వచ్చినట్లు తెలుస్తోంది.
ఎంతటి నేతైనా బలమున్న చోటే రాజకీయాలు చేయాలి. ఈ విషయం షర్మిలాకు తెలియనిది కాదు. అన్నకు వ్యతిరేకంగా రాజకీయాలు చేయాలనుకున్నా.. కుటుంబ పరంగా చూసుకుని ఆమె తెలంగాణ వైపు అడుగు పెట్టారు. అక్కడ పార్టీని పెట్టి తమ కుటుంబానికి అచ్చొచ్చిన పాదయాత్రను చేశారు. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. తెలంగాణ ప్రజలను పెద్దగా ఆకర్షించలేకపోయారు. ఇప్పుడు ఏ ఆప్షను లేకపోవడంతో కాంగ్రెస్తో కాళ్ళ బేరానికి దిగారు. తొలుత తెలంగాణలో కొనసాగుతానని చెప్పారు. కానీ ఆమె సేవలను ఏపీలో వినియోగించుకోవాలని హై కమాండ్ భావిస్తోంది. అందుకే విలీన ప్రక్రియలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవడం షర్మిలకు అనివార్యం గా మారింది.
అయితే ఇన్నాళ్లకు ఆమె మొహమాటలు విడిచిపెట్టి కాంగ్రెస్ హై కమాండ్ ఆదేశాలను పాటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో విజయమ్మ సపోర్ట్ ఎవరికి అన్నది పెద్ద డౌట్ గా మారింది. ఇప్పటివరకు విజయమ్మ కూతురు వైపే మొగ్గు చూపారు. కూతురుకి అండగా ఉండేందుకే ఇష్టపడ్డారు. అందుకే వైసిపి గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
అయితే తాజాగా షర్మిల నిర్ణయంతో విజయమ్మకు క్లిష్ట పరిస్థితి ఎదురైంది. అన్నకు ధీటుగా చెల్లెలు తెరపైకి రావడం ఖాయం. దీంతో షర్మిలను కట్టడి చేయాలని విజయమ్మపై జగన్ ఒత్తిడి చేస్తారు. అటువంటి సమయంలో విజయమ్మ ఓపెన్ కాక తప్పదు. ఒకవేళ షర్మిల పక్క విజయమ్మ నిలబెడితే జగన్ కు రాజకీయంగా భారీ దెబ్బే. ఇప్పటివరకు వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరుని చెప్పుకునే జగన్ రాజకీయం చేశారు. ఇప్పుడు అదే కుటుంబంలో విభజన రావడం, తల్లీ చెల్లిని పట్టించుకోవడం లేదన్న అపవాదు ఎదురు కానుండడంతో తప్పకుండా దెబ్బ తగలడం ఖాయం. అందుకే జగన్ ఆ పరిస్థితి రాకుండా శతవిధాలా ప్రయత్నించారు. కానీ సఫలీకృతం కాలేకపోయారు. ఇప్పటికే విపక్షాల ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నారు. కొత్తగా సోదరి తెరపైకి రానుండడంతో మల్ల గుల్లాలు పడుతున్నారు.