Homeఆంధ్రప్రదేశ్‌Chirala YCP: అటు చీరాల.. ఇటు పర్చూరు.. వైసీపీలో ఆమంచి చిచ్చు

Chirala YCP: అటు చీరాల.. ఇటు పర్చూరు.. వైసీపీలో ఆమంచి చిచ్చు

Chirala YCP: ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల అంటే ముందుగా గుర్తొచ్చేది ఆమంచి కృష్ణమోహన్. నియోజకవర్గం లో పట్టున్న నేత ఆయన. ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసి మరీ గెలిచారు. అటువంటి నాయకుడు చీరాల వదులుకోవాల్సి వచ్చింది. పక్కనే ఉన్న పర్చూరు వెళ్లాల్సి వచ్చింది. అయితే అక్కడ కూడా ఆయన అసమ్మతి ఎదుర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అక్కడ గెలుపు సులువు కాదని భావిస్తున్నారు. అందుకే దూకుడు కనబరుస్తున్నారు. అయితే సీఎం జగన్ సొంత సామాజిక వర్గం నుంచి ఆయనకు కొత్త తల నొప్పులు రావడం విశేషం.

గత ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ అభ్యర్థిగా చీరాల నుంచి బరిలో దిగారు. అప్పటివరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆమంచి వైసిపి గూటికి చేరి టికెట్ దక్కించుకున్నారు. దీంతో కృష్ణమోహన్ను ఎలాగైనా దెబ్బ కొట్టాలని చంద్రబాబు భావించారు. అనూహ్యంగా చివరి నిమిషంలో కరణం బలరాం రంగంలోకి దించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా జగన్ ప్రభంజనం వీచినా.. చీరాలలో మాత్రం టిడిపి అభ్యర్థి కరణం బలరాం గెలుపొందారు. అయితే ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కరణం బలరాం వైసీపీలోకి వచ్చారు. ఇది ఆమంచి కృష్ణమోహన్ కు మింగుడు పడలేదు. రెండు వర్గాల మధ్య గొడవలు, వివాదాలు నడిచాయి. దీంతో సీఎం జగన్ స్పందించాల్సి వచ్చింది. ఆమంచి కృష్ణమోహన్ ను పర్చూరుకు పంపించడంతో కొంతవరకు వివాదాలను నియంత్రించగలిగారు.

అయితే పర్చూరు వెళ్ళినా చీరాలపై కృష్ణ మోహన్ ఆసక్తి వీడలేదు. మొన్న ఆ మధ్యన పంచాయతీ ఉప ఎన్నికల్లో కరణం బలరాం వర్గీయులతో గొడవ కూడా పడ్డారు. ఒకానొక దశలో ఇరు వర్గాల వారు కొట్టుకున్నారు. దీంతో పార్టీ హై కమాండ్ కు ఇదో తలనొప్పిగా మారింది. ఆమంచి కృష్ణమోహన్ విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియడం లేదు. బలమైన నేత కావడంతో ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోందని వైసీపీలో ఒక రకమైన ప్రచారం జరుగుతోంది.

అటు పర్చూరులో సైతం ఆమంచి కృష్ణమోహన్ పరిస్థితి ఏమంత బాగాలేదు. ఆయన పార్టీలో ఉంటారా? ఉండరా? అన్న టాక్ కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటుబావుట ఎగురవేస్తున్నారు. నియోజకవర్గంలోని చిన్నగంజాం ఎంపీపీ కోమట్ల అంకమ్మ రెడ్డి అసమ్మతి స్వరం వినిపించారు. ఏకంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆమంచి వద్దు జగన్ ముద్దు అని నినదించారు. ఆమంచి కృష్ణమోహన్ ఒంటెద్దు పోకడలను దుయ్యబట్టారు. ఆయన నాయకత్వంలో పనిచేసేది లేదని తేల్చి చెప్పారు. దీంతో అటు చీరాల, ఇటు పర్చూరులో ఆమంచి కొత్త తలనొప్పులు తీస్తున్నారని హై కమాండ్ భావిస్తోంది. ఎప్పటికీ ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు జనసేనలో చేరారు. త్వరలో కృష్ణమోహన్ సైతం చేరుతారని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఎటువంటి సమయంలోనే కృష్ణమోహన్ పై సొంత పార్టీ శ్రేణులు తిరుగుబాటు చేయడం విశేషం. మున్ముందు మాత్రం వైసీపీలో కృష్ణ మోహన్ పెను సంచలనాలకు వేదికయ్యే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version