ఫీజులు వసూలు చేశారు.. స్కూళ్లు మూశారు..

కరోనా సెకండ్‌ వేవ్‌తో ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఫలితంగా రెండు మూడు నెలల క్రితం తెరచుకున్న విద్యా సంస్థలను తెలంగాణ సర్కారు మళ్లీ మూసేసింది. ఈ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందనే వస్తున్నా.. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ శాఖ మాత్రం కాస్త వింతగా స్పందించింది. టీ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ నోట నుంచి వచ్చిన ఈ స్పందన కాస్తంత లాజికల్ గానే కనిపిస్తున్నా.. మరీ కరోనా కట్టడిపైనా ఇలాంటి […]

Written By: Srinivas, Updated On : March 25, 2021 1:14 pm
Follow us on


కరోనా సెకండ్‌ వేవ్‌తో ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఫలితంగా రెండు మూడు నెలల క్రితం తెరచుకున్న విద్యా సంస్థలను తెలంగాణ సర్కారు మళ్లీ మూసేసింది. ఈ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందనే వస్తున్నా.. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ శాఖ మాత్రం కాస్త వింతగా స్పందించింది. టీ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ నోట నుంచి వచ్చిన ఈ స్పందన కాస్తంత లాజికల్ గానే కనిపిస్తున్నా.. మరీ కరోనా కట్టడిపైనా ఇలాంటి విమర్శలు చేస్తారా? అన్న దిశగా ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి.

కరోనాను కట్టడి చేయకుంటే ఎలాంటి ఫలితాలు చూడాల్సి వస్తుందో ఇప్పటికే అనుభవంలోకి వచ్చిన నేపథ్యంలో దాసోజు ఆరోపణలపై ఓ రేంజిలో సెటైర్లు పడుతున్నాయి. ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే.. ‘పుట్ట గొడుగుల్లా వెలసిన ప్రైవేట్ విద్యా సంస్థలు పిల్లల నుంచి ఫీజులు వసూలు చేసుకునేందుకే తమ గేట్లను తెరచి.. ఫీజుల వసూళ్లు ముగియగానే.. తిరిగి వాటిని మూసివేశారని.. ఇందుకు ప్రభుత్వం కూడా తనవంతు పూర్తి సహకారాన్ని అందించిందని’ దాసోజు తనదైన శైలి కామెంట్లు చేశారు. తన ఆరోపణలన్నీ లాజికల్ గానే ఉంటాయన్న భావన కలిగించేలా మరో అంశాన్ని కూడా దాసోజు లేవనెత్తారు. కేవలం పాఠశాలలను మాత్రమే మూసేసి… బార్లు, థియేటర్లు, మాల్స్‌ను కొనసాగిస్తే ఫలితం ఏముంటుందని కూడా ఆయన ప్రశ్నించారు.

జనసమ్మర్ధంగా ఉన్న ఇతరత్రా వ్యవహారాలపై ఎలాంటి నిషేధం విధించని కేసీఆర్ సర్కారు.. పాఠశాలలను మాత్రమే మూసేస్తున్నట్లుగా ప్రకటించిన వైనాన్ని దాసోజు తనదైన లాజికల్ కామెంట్లతో సంధించారు. అంతటితో ఆగని దాసోజు.. కరోనా నియంత్రణలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో తెలంగాణను పోల్చి… కరోనాను నియంత్రిస్తుందని భావిస్తున్న వ్యాక్సిన్ పంపిణీలో తెలంగాణ చాలా వెనుకబడి ఉందన్న విషయాన్ని బయటపెట్టారు.

వ్యాక్సిన్ పంపిణీలోనూ తెలంగాణ ఇతర రాష్ట్రాల కన్నా చాలా వెనుకబడి ఉందని.. ఇప్పటిదాకా రాష్ట్రంలో 9.40 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ వేసిన వైనమే ఇందుకు నిదర్శనమని కూడా ఆయన పేర్కొన్నారు. మొత్తంగా కరోనా కట్టడి కోసమంటూ కేసీఆర్ సర్కారు పాఠశాలలను మూసేస్తూ తీసుకున్న నిర్ణయంపై దాసోజు ఇలా తనదైన శైలి లాజికల్ పాయింట్లతో విరుచుకుపడ్డారు. మరి దాసోజుకు గులాబీ పార్టీ నుంచి గానీ కేసీఆర్ సర్కారు నుంచి గానీ ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.