Ethanol Fuel in India: ప్రపంచ పర్యావదన దినం సందర్భంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఇంధన రంగంలో కీలక మలుపు. కేంద్ర పెట్రోలియం మంత్రి హరదీప్ సింగ్ పురి ఢిల్లీలో ఈ–85 ఇంధనాన్ని అధికారికంగా లాంచ్ చేశారు. ఇందులో 80–85% ఇథనాల్, 14–19% పెట్రోల్ ఉంటాయి. ఢిల్లీలో దీని ధరూ.82.12గా నిర్ణయించారు. సాధారణ పెట్రోల్ ధరకన్నా రూ.20 తక్కువకే ఈ–85 ఇంధనం అందుబాటులోకి వచ్చింది.ఈ–20ను షెడ్యూల్ కంటే ముందే సాధించిన భారత్, ఇప్పుడు ఉన్నత స్థాయి ఇథనాల్ బ్లెండింగ్ దిశగా ధైర్యవంతమైన అడుగు వేసింది.
ఈ–85 అంటే ఏమిటి?
ఈ–85 అనేది ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికిల్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఇంధనం. సాధారణ కార్లు, బైకులు దీన్ని ఉపయోగించలేవు. ఇంజన్ను ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు మాత్రమే ఈ–85ను సమర్థవంతంగా ఉపయోగించగలవు. ప్రస్తుతం హీరో మోటోకార్ప్ (స్ప్లెండర్+ ఫ్లెక్స్ ఫ్యూయల్, ఏఊ డీలక్స్), సుజుకి గిక్సర్ ఎస్ఎఫ్ 250 వంటి కొన్ని మోడల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మారుతి సుజుకి వాగన్ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ను త్వరలో మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది.
ఆర్థిక ప్రయోజనాలు…
ఈ–85 ధర తగ్గడం వినియోగదారులకు తక్షణ ప్రయోజనం. కానీ నిజమైన లాభం దేశ స్థాయిలో ఉంది. ఈ–20 పాలసీ ద్వారా ఇప్పటికే రూ.1.84 లక్షల కోట్ల విదేశీ మారక నిల్వలు ఆదా అయ్యాయని మంత్రి పురి తెలిపారు. ఈ–85 విస్తరణతో ఈ సేవింగ్స్ ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇథనాల్ దేశీయంగా ఉత్పత్తి అవుతుంది కాబట్టి క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గుతాయి, డాలర్ ఖర్చు తగ్గుతుంది. రైతులకు అదనపు ఆదాయం (పంచదార, మొక్కజొన్న, 2ఎ ఇథనాల్ ద్వారా వ్యవసాయ వ్యర్థాలు) వస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి లభిస్తుంది.
పర్యావరణ ప్రయోజనాలు..
ఈ–85 సాధారణ పెట్రోల్తో పోలిస్తే 50–60% తక్కువ కార్బన్ ఎమిషన్లను విడుదల చేస్తుంది. వాయు కాలుష్యం తగ్గడం, ఆరోగ్య సమస్యలు తగ్గడం దీర్ఘకాలిక లాభాలు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజే ఈ – 85ను లాంచ్ చేయడం యాదృచ్ఛికం కాదు. ఇది సవాలుతో కూడిన మార్గం. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు ఇంకా చాలా తక్కువ.
ప్రస్తుతం ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, పూణే, నాగ్పూర్లో మాత్రమే 50 పెట్రోల్ బంకుల్లో అందుబాటులో ఉంది. 2026 చివరి నాటికి 500 స్టేషన్లు, 2027 నాటికి 5,000 స్టేషన్లు అన్నది లక్ష్యం.
ఇంజన్ పనితీరు, మైలేజ్, శీతాకాలంలో కోల్డ్ స్టార్ట్ సమస్యలు కూడా పరిశీలించాల్సి ఉంది.
ఈ–85 లాంచ్ భారత్ను ఇంధన దిగుమతి భారం నుంచి విముక్తి కగిలిస్తుంది. ఇది రైతు, పర్యావరణం, ఆర్థిక స్వావలంబన, శక్తి భద్రత నాలుగు లక్ష్యాలను ఏకకాలంలో సాధించే అవకాశం ఇస్తోంది. ఇది విజయవంతం కావాలంటే కేవలం లాంచ్ చేయడం సరిపోదు. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల ఉత్పత్తిని వేగవంతం చేయడం, ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను త్వరగా విస్తరించడం, వినియోగదారుల్లో అవగాహన కల్పించడం ఇవన్నీ ఒకేసారి జరగాలి.
