బర్తరఫ్: ఈటల కథ ముగిసింది!

టీఆర్ఎస్ నుంచి మరో వికెట్ పడిపోయింది. టీఆర్ఎస్ వ్యవస్థాపకులు కేసీఆర్ తో కలిసి నడిచిన మరో పాదం అవమానకర రీతిలో వైదొలగాల్సి వచ్చింది. ఆలె నరేంద్ర, ఓ విజయశాంతిలాగానే ఈటల రాజేందర్ సైతం అవమానకర రీతిలో టీఆర్ఎస్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. తెలంగాణ ఉద్యమాన్ని భుజాలపై మోసిన తొలి ఉద్యమకారుడు భూకబ్జా ఆరోపణలతో రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించబడ్డారు. సీఎం కేసీఆర్ సిఫారసు మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈటలను బర్తరఫ్ చేస్తూ ఆదేశాలు జారీ […]

Written By: NARESH, Updated On : May 2, 2021 9:35 pm
Follow us on

టీఆర్ఎస్ నుంచి మరో వికెట్ పడిపోయింది. టీఆర్ఎస్ వ్యవస్థాపకులు కేసీఆర్ తో కలిసి నడిచిన మరో పాదం అవమానకర రీతిలో వైదొలగాల్సి వచ్చింది. ఆలె నరేంద్ర, ఓ విజయశాంతిలాగానే ఈటల రాజేందర్ సైతం అవమానకర రీతిలో టీఆర్ఎస్ నుంచి వైదొలగాల్సి వచ్చింది.

తెలంగాణ ఉద్యమాన్ని భుజాలపై మోసిన తొలి ఉద్యమకారుడు భూకబ్జా ఆరోపణలతో రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించబడ్డారు. సీఎం కేసీఆర్ సిఫారసు మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈటలను బర్తరఫ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మెదక్ జిల్లా అచ్చంపేట పరిధిలో రైతుల భూములను కబ్జా చేశారనే ఆరోపణలపై మంత్రి ఈటల రాజేందర్ పై సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మెదక్ జిల్లా కలెక్టర్ సహా విజిలెన్స్ విచారణ జరిపింది. ఈటల తన హ్యాచరీస్ సహా పక్కనే ఉన్న అసైన్డ్ భూములును కబ్జా చేశారని ప్రాథమిక విచారణలో తేలిందని కలెక్టర్ తెలిపారు. నిన్న దర్యాప్తునకు సంబంధించిన పూర్తి నివేదికను సీఎస్ కు మెదక్ కలెక్టర్ అందించారు.

ఇక శనివారమే ఈటల నుంచి వైద్య ఆరోగ్యశాఖ ను తొలగించిన కేసీఆర్ తనకు అట్టిపెట్టుకున్నారు. ఈ మేరకు నోటీఫికేషన్ విడుదలైంది. తాజాగా ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈట‌ల‌పై ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఆయనపై సానుభూతి తెలంగాణ సమాజంలో వ్యక్తమవుతోంది. పెద్ద‌గా మ‌కిలీ అంటిన‌ట్టుగా క‌నిపించ‌ట్లేదు. మీడియా క‌థ‌నాలు ఎలా ఉన్నా.. సోష‌ల్ మీడియాలో మాత్రం ఈట‌ల‌కు పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు క‌నిపిస్తోంది. ఇదంతా.. ఉద్దేశ‌పూర్వ‌కంగానే సాగుతోందంటూ విశ్లేష‌ణ‌లు రాసుకొస్తున్నారు నెటిజ‌న్లు. ఈ విష‌యంలో సాధార‌ణ జ‌నంతోపాటు తెలంగాణ ఉద్య‌మంలో నిజాయితీగా పాల్గొన్న‌వారంతా ఈట‌ల‌కు వెన్నుద‌న్నుగా నిలుస్తున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. అంతేకాదు.. టీఆర్ఎస్ మొద‌లైన నాటినుంచి ఏదో ఒక ఆరోప‌ణ‌ల‌తో బ‌య‌ట‌కు పంపివేయ‌బ‌డ్డ నేత‌ల జాబితాను కూడా బ‌య‌ట‌కు తీస్తున్నారు. టీఆర్ఎస్ కొత్త‌లో ఆలె న‌రేంద్ర‌, ఆ త‌ర్వాత విజ‌య‌శాంతి, మంత్రి రాజ‌య్య వంటి వారు ఏదో ఒక ఆరోప‌ణ‌ల‌తో టీఆర్ఎస్ నుంచి బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు నెట్టివేయ‌బ‌డిన‌వారే. ఇప్పుడు ఈట‌లను కూడా వారి జాబితాలో క‌లిపేందుకు చూస్తున్నార‌ని చాలా మంది సానుభూతి వ్య‌క్తం చేస్తున్నారు.

తెలంగాణ ఉద్య‌మంలో నిజాయితీగా ప‌నిచేసిన నేత‌ల్లో ఈట‌ల రాజేంద‌ర్ పేరు త‌ప్ప‌కుండా ఉంటుందని, అలాంటి నేత‌పై అభాండాలు వేసే కుట్ర జ‌రుగుతోంద‌ని ప‌లువురు సోషల్ మీడియాలో అభిప్రాయ ప‌డుతున్నారు. టీఆర్ఎస్ అధిష్టానం కావాల‌నే ఇదంతా చేస్తోంద‌ని సింహ‌భాగం ప్ర‌జ‌లు ఓ అంచ‌నాకు వ‌చ్చేసిన‌ట్టు చెబుతున్నారు.

కాగా.. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో మంత్రి ఈట‌ల స్పందించారు. అందులో ఎక్క‌డా ఆయ‌న ఆవేశ ప‌డ‌లేదు. త‌న‌పై కుట్ర‌ జ‌రుగుతోంద‌ని ఎక్క‌డా అన‌లేదు. నిజాల్ని బ‌య‌ట‌పెట్టండి అని మాత్ర‌మే కోరారు. దీంతో.. ఈట‌ల‌కు మ‌రింత సానుభూతి పెరిగింద‌ని, ఆయ‌న‌కు మ‌ద్ద‌తు కూడా మ‌రింత‌గా పెరిగింద‌ని విశ్లేషిస్తున్నారు.మీడియాను అడ్డం పెట్టుకొని నింద‌లు వేస్తే.. జ‌నం న‌మ్మే రోజులు పోయాయ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అంతేకాదు.. గ‌తంలో అధినేత ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా అండ‌గా నిలిచే శ్రేణులు కూడా.. ఈట‌ల విష‌యంలో మాత్రం మ‌ద్ద‌తు తెల‌ప‌లేక‌పోతున్నార‌ని అంటున్నారు.

ఇప్ప‌టికే ఉద్య‌మంలో పాల్గొని.. గుర్తింపు ద‌క్క‌నివారు ఆవేద‌న‌లో ఉన్నారు. ఇప్ప‌డు ఈట‌ల‌పైనా బుర‌ద జ‌ల్లేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌డంతో నివురుగ‌ప్పిన నిప్పు బ‌లంగా రాజుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో.. వ్యూహం ఎదురు తిరిగిందా? అనే విశ్లేష‌ణలు కూడా వ‌స్తున్నాయి. మ‌రి, ముందు ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.