ఎప్పుడైనా సార్వత్రిక ఎన్నికలప్పుడు పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేయడం చూశాం. తాము అధికారంలోకి వస్తే భవిష్యత్తులో ఏం చేస్తామో తెలుపుతూ పార్టీ అఫిషియల్గా ముద్రించి ఇచ్చే హామీలు. వాటికనుగుణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేస్తుంటారు. అయితే.. అదేంటో కానీ తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
40 ఏండ్ల రాజకీయ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు.. పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరిగేవని తెలియదా..? పంచాయతీ ఎన్నికలకు కూడా పార్టీ మేనిఫెస్టో ఉంటుందా..? అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అనే విషయం అంత సీనియర్ లీడర్కు తెలియకపోవడం ఏంటి..? దీనిపై వైసీపీ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసింది. దీంతో కమిషనర్ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోను ముద్రించినట్లుగా క్లెయిమ్ చేసుకున్న టీడీపీ కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజుకు నోటీసులు జారీ చేసింది.
ఈ మేనిఫెస్టో అంశంపై వైసీపీ మూడు రోజులుగా విమర్శలు చేస్తోంది. తాము ఫిర్యాదు చేయబోమని సుమోటోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. అయితే.. తర్వాత ఏమనుకున్నారో కానీ వైసీపీ లీగల్ సెల్ ద్వారా ఫిర్యాదు చేయించారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎస్ఈసీ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి రెండో తేదీలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజునే చంద్రబాబునాయుడు ‘పల్లె ప్రగతి–పంచ సూత్రాలు’ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు.
పార్టీల గుర్తుల పరంగా జరగని ఎన్నికలకు ఇలా మేనిఫెస్టో విడుదల చేయడం నిబంధనలకు వ్యతిరేకమని వైసీపీ వెంటనే విమర్శలు ప్రారంభించింది. అయితే గతంలోనూ తాము మేనిఫెస్టోలు విడుదల చేశామని టీడీపీ వాదిస్తూ వస్తోంది. చివరికి ఆ మేనిఫెస్టోను రిలీజ్ చేయడాన్ని ఎస్ఈసీ తప్పు పడుతోంది. ఇప్పుడు ఎస్ఈసీకి టీడీపీ సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ సంతృప్తికర సమాధానం ఇవ్వకపోతే.. తదుపరి చర్యలు తీసుకుంటారు. సహజంగా ఎన్నికల కమిషన్ మరోసారి అలాంటి తప్పు చేయవద్దన్న హెచ్చరికలతో సరి పెడుతుంది. మరి టీడీపీ విషయంలో నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారో చూడాలి.