ఈసీపై హత్యకేసు..నిగ్గదీసిన నిలబెట్టిన హైకోర్టు

కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై ఆది నుంచి అనుమానాలున్నాయి. తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి లాంటి బీజేపీ గెలవని రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించిన ఈసీ.. అదేంటో కానీ.. బీజేపీ గెలుపు అవకాశమున్న పశ్చిమ బెంగాల్ లో మాత్రం 8 విడతల్లో ఎన్నికలు పెట్టింది. అన్ని విడతలు బీజేపీ నేతల ప్రచారానికేనన్న అపవాదును మూటగట్టుకుంది. బెంగాల్ సీఎం మమత సైతం ‘బీజేపీ చేతిలో ఈసీ కీలుబొమ్మగా మారిందని.. దమ్ముంటే ఒకే విడతలో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలి’ అని […]

Written By: NARESH, Updated On : April 26, 2021 3:18 pm
Follow us on

కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై ఆది నుంచి అనుమానాలున్నాయి. తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి లాంటి బీజేపీ గెలవని రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించిన ఈసీ.. అదేంటో కానీ.. బీజేపీ గెలుపు అవకాశమున్న పశ్చిమ బెంగాల్ లో మాత్రం 8 విడతల్లో ఎన్నికలు పెట్టింది. అన్ని విడతలు బీజేపీ నేతల ప్రచారానికేనన్న అపవాదును మూటగట్టుకుంది. బెంగాల్ సీఎం మమత సైతం ‘బీజేపీ చేతిలో ఈసీ కీలుబొమ్మగా మారిందని.. దమ్ముంటే ఒకే విడతలో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలి’ అని ఆమె డిమాండ్ కూడా చేశారు.

ఇప్పటికీ ఈసీ షెడ్యూల్స్ అన్నీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ చెప్పినట్టే చేస్తోందన్న విమర్శ ఉంది. ఇప్పుడు దేశంలో కరోనా సెకండ్ వేవ్ కు ఈసీ ఎన్నికలు నిర్వహించడమే కారణమన్న ఆరోపణలున్నాయి. దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలే కరోనా వైరస్ వ్యాప్తికి దోహదం చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. రాజకీయ పార్టీలన్నీ కనీసం కరోనా నిబంధనలు పాటించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

దేశంలో ఇప్పుడు కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడానికి ఎన్నికల కమిషన్ యే కారణమని మద్రాస్ హైకోర్టు మండిపడింది. కోవిడ్ నిబంధనల విషయంలో ఈసీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని మండిపడింది. ఈ అంశంలో ఎన్నికల సంఘంపై హత్య కేసు నమోదు చేయాలని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ తో కూడిన ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ కొనసాగుతున్న వేళ రాజకీయ పార్టీల ర్యాలీలను ఎందుకు అడ్డుకోలేదని ధర్మాసనం నిలదీసింది. ప్రస్తుతం ఈ పరిస్థితికి కేవలం కేంద్ర ఎన్నికల సంఘం కారణమని.. ఈ సమయంలో మీరు మరో గ్రహంపై ఉన్నారా? అని హైకోర్టు నిప్పులు చెరిగింది.

మే 2న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల రోజున కోవిడ్ ప్రోటోకాల్ పై ప్రణాళిక అందజేయకపోతే కౌంటింగ్ నిలిపివేస్తాం అని మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రజారోగ్యానికే ప్రథమ ప్రాధాన్యమని హైకోర్టు స్పష్టం చేసింది.