Ebola Virus: ఆఫ్రికా దేశాలను ఎబోలా వైరస్ వణికిస్తోంది. బాధితుల సంఖ్యం వేగంగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్వో అప్రమత్తమైంది. ప్రపంచ దేశాలకు కీలక సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారత ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ దేశాలకు అత్యవసర కారణాలు తప్ప భారతీయులు ప్రయాణించవద్దని స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. అక్కడ నివసించే భారతీయులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఆందోళనకరంగా వ్యాధి తీవ్రత..
కాంగోలో ఇప్పటికే సుమారు 750 కేసులు నమోదు కాగా, 177 నుంచి 204 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనాలు వస్తున్నాయి. ఎబోలా వంటి అతి ప్రమాదకర వైరస్ రక్తం, శరీర ద్రవాల ద్వారా వేగంగా వ్యాపించే సామర్థ్యం కలిగి ఉండటం, ప్రత్యేక చికిత్స, టీకా లభ్యత కొరవడటం వంటి అంశాలు ఈ ముప్పును మరింత తీవ్రం చేస్తున్నాయి. ఆఫ్రికా ఖండంలోని అస్థిరత, సరిహద్దు దాటిన కదలికలు వ్యాధి వ్యాప్తిని మరింత సవాలుగా మార్చాయి. గతంలో ఎబోలా అవుట్ బ్రేక్లు ప్రపంచానికి ఎన్నో హెచ్చరికలు ఇచ్చాయి. కానీ ప్రతిసారీ మనం సిద్ధతలో వెనుకబడటం బాధ్యతావంతమైన పాలనకు మంచి సంకేతం కాదు.భారత్ చర్యలు – సానుకూల అడుగుభారత్ ఇంకా ఎబోలా కేసులు నమోదు కాకపోవడం శుభవార్త. అయినప్పటికీ కేంద్రం ఎయిర్పోర్టుల్లో స్క్రీనింగ్ పెంచడం, ప్రయాణికులకు సూచనలు ఇవ్వడం, అవసరమైతే క్వారంటైన్ వ్యవస్థలను సిద్ధం చేయడం వంటి చర్యలు ప్రశంసనీయం.
కోవిడ్ నుంచి పాఠాలు..
కోవిడ్ మహమ్మారి నుంచి నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు ఉపయోగపడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ హెచ్చరికలు కేవలం తాత్కాలికం కాకుండా, దీర్ఘకాలిక వ్యూహంగా మారాలి. వైద్యులు, పరిశోధనా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు అందరూ ఏకకాలంలో పనిచేయాల్సిన అవసరం ఉంది.
వైద్య సదుపాయాల కొరత..
ఆఫ్రికా దేశాల్లో వైద్య సదుపాయాల కొరత, రాజకీయ అస్థిరత, సమాచార వ్యవస్థ బలహీనతలు వ్యాధి నియంత్రణను కష్టతరం చేస్తున్నాయి. భారత్ వంటి దేశాలు తమ సరిహద్దులను రక్షించుకోవడంతోపాటు, అంతర్జాతీయ స్థాయిలో వైద్య సహాయం, టీకా పరిశోధనలు, సాంకేతిక సహకారం అందించడంలో కూడా తన వంతు పాత్ర నిర్వహించాలి. భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులు మరిన్ని రావచ్చు. కాబట్టి సర్వైలెన్స్ వ్యవస్థలను బలోపేతం చేయడం, ఆసుపత్రుల్లో సామర్థ్యం పెంచడం, ప్రజల్లో ఆరోగ్య అవగాహన మెరుగుపరచడం వంటి చర్యలు నిరంతరం కొనసాగాలి.
కేంద్ర ప్రభుత్వం ఎబోలా నేపథ్యంలో చూపుతున్న చురుకైన వైఖరి ప్రశంసనీయం. అయితే ఈ సవాలు మనకు ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా. ప్రపంచం మరింత దగ్గరవుతున్న ఈ కాలంలో ఏ దేశం కూడా ఒంటరిగా సురక్షితం కాదు. సమయోచిత హెచ్చరికలతోపాటు, దృఢమైన ఆరోగ్య రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే మనం భవిష్యత్ ముప్పులను ధైర్యంగా ఎదుర్కోగలం.
