రెండు నెలల తర్వాత దేశవ్యాప్తంగా దాదాపు అన్ని విమానాశ్రయాల నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. అయితే కొన్ని చోట్ల విమానయాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అయోమయానికి లోనవుతున్నారు. టికెట్ బుకింగ్ చేసుకుని ఎయిర్ పోర్ట్ వచ్చిన తర్వాత.. విమానం రద్దు అయినట్లు వారికి సమాచారం ఇస్తున్నారు. దీంతో ఆ ప్రయాణికులు ఏం చేయాలో అర్థంకాక సతమతమవుతున్నారు. ముంబై విమానాశ్రయం నుంచి పాట్నా వెళ్లవలిసిన విమానాన్ని ఇవాళ రద్దు చేశారు. ఉదయం ప్రారంభం కావాల్సిన ఆ విమానంను రద్దు చేశారు. దీంతో ఎయిర్ పోర్ట్కు వచ్చిన వారంతా షాకయ్యారు.
బెంగుళూరులో కూడా ఇలాంటి సమస్య తలెత్తింది. బెంగుళూరు నుంచి హైదరాబాద్ కు రావాల్సిన విమానాన్ని అకస్మాత్తుగా రద్దు చేశారు. ఎయిర్ లైన్స్ నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. బోర్డింగ్ పాస్ లను స్కానింగ్ చేస్తున్న సమయంలో తమ విమానం రద్దు అయినట్లు సిబ్బంది తెలియజేశారని ఓ ప్రయాణికుడు ఆరోపించాడు. ఢిల్లీ విమానాశ్రయంలో ఇవాళ 80 విమానాలను రద్దు చేశారు. దాంట్లో డిపార్చర్స్ , అరైవల్స్ ఉన్నాయి. ముంబై విమానాశ్రయంలో 25 టేకాఫ్ లు, 25 ల్యాండిగ్స్ కు అనుమతి ఉన్నది. చెన్నైలో 25 విమానాలకు మాత్రమే అరైవల్ అనుమతి ఉన్నది.