Homeజాతీయ వార్తలుతమిళ గడ్డపై మజ్లిస్‌ మ్యాజిక్‌ : డీఎంకేతో పొత్తు కుదిరేనా..?

తమిళ గడ్డపై మజ్లిస్‌ మ్యాజిక్‌ : డీఎంకేతో పొత్తు కుదిరేనా..?

MIM
మొన్నటి వరకు కేవలం హైదరాబాద్‌ రాజకీయాలకే పరిమితమైన ఎంఐఎం పార్టీ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై తన మనసును మళ్లించింది. ఇప్పటికే గతేడాది జరిగిన బీహార్‌‌ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగి.. సత్తా చాటింది. ఇక ఈ ఏడాది జరగబోయే తమిళనాడు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ రంగంలోకి దిగి సత్తా చాటాలని భావిస్తోంది. బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పొత్తుకు విముఖత చూపడంతో అక్కడ ఎంఐఎం ఒంటరిగానే బరిలో దిగుతోంది. తమిళనాడులో ప్రస్తుతం డీఎంకెతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న ఆ పార్టీ.. ఒకవేళ కుదరకపోతే అక్కడ కూడా ఒంటరిగానే బరిలో దిగే అవకాశం ఉంది.

Also Read: కరోనా దెబ్బ.. మోడీ కొరఢా.. పాక్ కాల్పుల విరమణ వెనుక కథ

ఇప్పటికే ఎంఐఎం డీఎంకేను సంప్రదించినప్పటికీ అటువైపు నుంచి ఇంకా ఎలాంటి స్పందన అయితే రాలేదు. ఇప్పటికే ఇండియన్ ముస్లిం లీగ్ డీఎంకేతో పొత్తు కుదుర్చుకోవడం.. ఆ పార్టీకి 3 సీట్లు కేటాయించడం జరిగింది. కాబట్టి మరో ముస్లిం పార్టీని కూటమిలో చేర్చుకునేందుకు డీఎంకే సుముఖత చూపకపోవచ్చు. అదే జరిగితే ఎంఐఎం ఒంటరిగా బరిలో దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా.. తమిళనాడు ఎంఐఎం చీఫ్ వకీల్ అహ్మద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మొత్తం 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాము పోటీ చేయబోతున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం డీఎంకేతో చర్చలు జరుపుతున్నామని.. ఒకవేళ అవి సఫలం కాకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. అన్నాడీఎంకేతో పొత్తు ఆలోచనే లేదన్నారు. ఎంఐఎం అధికార ప్రతినిధి మసూద్ ఖాన్ ఒక ప్రశ్నకు బదులిస్తూ.. ఇతర ముస్లిం పార్టీలు ఎంఐఎంను చూసి భయపడుతున్నాయని అన్నారు. ఓవైసీ లాంటి బలమైన నేత తమ పార్టీకి ఉండటమే అందుకు కారణమన్నారు.

Also Read: ఎట్టకేలకు గల్లా జయదేవ్ బయటకొచ్చాడు.. ఏం చేశాడంటే?

తమిళనాడులో ముస్లిం జనాభాకు తగినట్లుగా చట్ట సభల్లో వారికి ప్రాతినిధ్యం కల్పించాలన్నదే ఎంఐఎం ఎజెండా అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 9 శాతం ముస్లిం జనాభాను పరిగణలోకి తీసుకుంటే కనీసం 25 స్థానాల్లో వారికి ప్రాతినిధ్యం ఉండాలని.. కానీ తమిళనాడులోని ముస్లిం పార్టీలు కేవలం 3 సీట్లతోనే సంతృప్తి చెందుతున్నాయని అన్నారు. పరోక్షంగా ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీని ఆయన ఎద్దేవా చేశారు. మార్చి 7న ఎంఐఎం అభ్యర్థులను ప్రకటిస్తుందని.. పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తమిళనాడులో ప్రచారం చేస్తారని చెప్పారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

2 COMMENTS

Comments are closed.

Exit mobile version