Homeజాతీయ వార్తలుTelangana Elections 2023: డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. బీజేపీలో నెక్ట్స్ వికెట్స్ వీరేనా?

Telangana Elections 2023: డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. బీజేపీలో నెక్ట్స్ వికెట్స్ వీరేనా?

Telangana Elections 2023: తెలంగాణలో పూర్వాశ్రమానికి నేతలు ఒక్కొక్కరుగా చేరుతున్నారు. గతంలో అనేక కారణాలు చూపుతూ కాంగ్రెస్కు దూరమైన నేతలు.. తిరిగి మాతృ సంస్థలోకి చేరుతున్నారు. ముఖ్యంగా బీజేపీలో చేరిన కాంగ్రెస్ పాత టీమ్ లో నేతలు హస్తం గూటికి చేరుతున్నారు. మరికొందరు చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ లు బిజెపిని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరన్న చర్చ ప్రారంభమైంది. ఈ తరుణంలో మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో డీకే అరుణ ఒక వెలుగు వెలిగారు. కాంగ్రెస్ హయాంలో కీలక శాఖల మంత్రిగా వ్యవహరించారు. జిల్లా నే శాసించిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఓ మహిళ నేతగా గుర్తించబడ్డారు. అయితే ఆమె అనుహ్యంగా బిజెపిలో చేరారు. కానీ తాను అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. ఈ ఎన్నికల్లో సైతం ఆమె అభ్యర్థిత్వం ఖరారు అయ్యింది. ఇప్పటికే బీజేపీ హై కమాండ్ ఆమె పేరును ప్రకటించింది. అయితే ఆమె కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె ఇంకా అక్కడ కొనసాగే ఉద్దేశంతో ఉన్నారా? ఆలోచిస్తున్నారా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఒకవేళ బిజెపిలో ఉండి ఆమె గెలిచినా.. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చినా.. ఆమె హస్తం గూటికి చేరడం ఖాయమని తెలుస్తోంది.

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సైతం పునరాలోచనలో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తుండడంతో కొంత సమయం ఉంది. అయితే ఈలోగా కాంగ్రెస్ లోకి రప్పిస్తే అడ్వాంటేజ్ ఉంటుందని అగ్రనేతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ పాటికే ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులు విశ్వేశ్వర్ రెడ్డి తో చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. బలమైన నేత కావడంతో ప్రభావం చూపుతారని.. కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనకారిగా పనికి వస్తారని హై కమాండ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు గానీ డీకే అరుణ, విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే మాత్రం.. కాషాయ దళానికి కోలుకోలేని దెబ్బే. మరి ఆ ఇద్దరు నేతలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఈ ఇద్దరు నేతలు కెసిఆర్ గద్దె దిగాలని బలంగా ఆకాంక్షిస్తున్న వారే. కాంగ్రెస్ పార్టీ సైతం కెసిఆర్ లక్ష్యంగా పావులు కదిపే నాయకులపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టింది. అటువంటి వారినే కాంగ్రెస్లో చేర్చుకోవాలని భావిస్తోంది. ఆ జాబితాలో డీకే అరుణతో పాటు విశ్వేశ్వర్ రెడ్డి ఉండడం విశేషం. అందుకే ఆ ఇద్దరు నేతలుకాంగ్రెస్ గూటికి తప్పకుండా వస్తారని తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version