Homeజాతీయ వార్తలుమహారాష్ట్రను మరోసారి బీజేపీ టార్గెట్‌ చేసిందా..?

మహారాష్ట్రను మరోసారి బీజేపీ టార్గెట్‌ చేసిందా..?

BJP
మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అక్కడి రాజకీయాలు ఎప్పుడు ఎటు వైపు మలుపుతిరుగుతాయో ఊహించడం కూడా కష్టం. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో కూడా కనీసం అక్కడి నేతలకూ అంతుబట్టదు. ఇప్పుడు ఓ ఆసక్తికర చర్చ రాష్ట్రమంతటా నడుస్తోంది. మహారాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు దాటింది. ఈ సంకీర్ణ భాగస్వామ్యంలో లుకలుకలు మొదలైనట్లుగా వార్తలు వస్తున్నాయి. గత పదిహేను నెలలుగా ఎలాగోలా నెట్టుకొచ్చిన ప్రభుత్వంలో.. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత అనూహ్య మార్పులు చోటుచేసుకొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

మహారాష్ట్రలో తమను కాదని శివసేన కాంగ్రెస్, ఎన్సీపీతో జట్టుకట్టింది. దీంతో అప్పటి నుంచి బీజేపీ ఆగ్రహంతో ఉంది. ప్రభుత్వాన్ని కూల్చి వేయడానికి అన్ని రకాల ప్రయత్నాలూ చేసింది. ఇంకా చేస్తోనే ఉంది. తొలినాళ్లలోనే అజిత్ పవార్‌‌కు గాలం వేసినా.. అది వర్కవుట్‌ కాలేదు. దీంతో కొన్నాళ్లు వేచి చూడాలన్న నిర్ణయానికి వచ్చిన బీజేపీ క్రమంగా ఇప్పుడు మళ్లీ పావులు కదుపుతోంది. ప్రస్తుతం మహారాష్ట్ర హోంమంత్రి అవినీతి వ్యవహారం మూడు పార్టీలనూ ఇబ్బందుల్లోకి నెట్టింది.

ఇక తాజాగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అక్కడ ఆమెకు మద్దతుగా ప్రచారంలోనూ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ను కాదని తృతీయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి శరద్ పవార్ చేస్తున్న యత్నాలు కూడా కాంగ్రెస్ అగ్రనేతలకు ఆగ్రహం తెప్పించేవిగా ఉన్నాయి. అయితే.. కాంగ్రెస్‌ మద్దతిస్తేనే మహారాష్ట్రలో సర్కార్‌‌ నడుస్తోంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి హెచ్చరికలు సైతం వినిపించాయి.

అయితే.. శరద్ పవార్ ఇప్పటికే మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ముప్పు లేదని శరద్ పవార్ చెబుతున్నారు. కానీ.. బీజేపీ మాత్రం తన ప్రయత్నాలను మానుకోలేదు. కరోనాను కట్టడి చేయడంలోనూ ఉద్ధవ్ థాక్రే విఫలమయ్యారని విపక్షాల నుంచి విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆగ్రహం, బీజేపీ మరోసారి చేస్తున్న ప్రయత్నాలు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి. అంతేకాదు.. మహారాష్ట్రలో మరికొద్ది రోజుల్లో రాష్ట్రపతి పాలన అంటూ పలువురు బీజేపీ నేతలు కూడా అంటున్నారు. మరి వీటన్నింటి ఎలా బయటపడాలో ఇప్పుడు థాక్రేకు పెద్ద టాస్క్‌లా మారింది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version