Homeఆంధ్రప్రదేశ్‌AP Politics : ఉత్తరాంధ్రలో కడప రెడ్ల రాజ్యం.. ధర్మాన కామెంట్స్ వైరల్

AP Politics : ఉత్తరాంధ్రలో కడప రెడ్ల రాజ్యం.. ధర్మాన కామెంట్స్ వైరల్

AP Politics : ఉత్తరాంధ్రలో రెడ్ల హవాను వైసిపి కీలక నేతలు సహించలేకపోతున్నారా? అందుకే ఉత్తరాంధ్ర సీనియర్లు అందరూ ఏక తాటిపైకి వస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి. మొన్నటి వరకు విజయసాయిరెడ్డి, నేడు వైవి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర పై పెత్తనం చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఎప్పుడో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు ఆయన సమకాలీకులుగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన జూనియర్లు పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఉత్తరాంధ్రలోని వైసిపి సీనియర్ నాయకులు గుర్రుగా ఉన్నారు. తాజాగా సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంధ్రలో సీనియర్ మోస్ట్ లీడర్. 1989 లోనే తొలిసారి ఎమ్మెల్యే అయి మంత్రి పదవి చేజిక్కించుకున్నారు. 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత ధర్మాన ప్రసాదరావు హవా పెరిగింది. 2014 వరకు ఆయన తన పెత్తనాన్ని కొనసాగించారు. వైసిపి ఆవిర్భావం తర్వాత జగన్ ను ధర్మాన తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ 2014 ఎన్నికల ముందు వైసీపీ గూటికి చేరారు. ఆ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. 2019లో తక్కువ మెజారిటీతో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. జగన్ క్యాబినెట్లో స్థానం ఆశించారు. కానీ జగన్ దూరం పెట్టారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో ధర్మానకు ఛాన్స్ ఇవ్వక తప్పలేదు.

అయితే 2019 ఎన్నికల తరువాత ధర్మాన పార్టీలో అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారు. మంత్రి పదవి దక్కకపోయేసరికి జగన్ పై బాహటంగానే విమర్శలు చేసేవారు. అయితే ఈ విషయం జగన్ కు తెలియంది కాదు. కానీ విస్తరణలో ఆయనకు చోటు దక్కకపోతే జిల్లాలో జరిగే మూల్యం జగన్ కు తెలుసు. అందుకే అనివార్య పరిస్థితుల్లోనే పదవి ఇచ్చారు. ఈ విషయం ధర్మానకు సైతం తెలుసు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ధర్మాన తన మనసులో ఉన్న మాటలను బయట పెడుతున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో తనకు ప్రమాద ఘంటికలు తప్పవని కూడా ధర్మానకు తెలుసు. ఈ పరిణామాల క్రమంలో ధర్మాన చేస్తున్న వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. జగన్ వైఖరి పై బాహటంగా విమర్శించే ఆయన.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పెద్దరికం చేస్తామంటే కుదరదని తాజాగా చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

శ్రీకాకుళం నియోజకవర్గంలోని ఓ సామాజిక వర్గ సమావేశంలో ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రలో కడప రెడ్లు భూ కబ్జాలు చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి శ్రీకాకుళంలో ఏం పని అని ప్రశ్నించారు. అక్కడి నుంచి వచ్చి భూములు కొట్టేస్తాను అంటే ఊరుకుంటానా? అంటూ మండిపడ్డారు. శ్రీకాకుళం ని అబ్బ గాడి సొమ్మా.. తంతాను అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కడప నుంచి వచ్చిన వారు ఇక్కడ అజమాయిషి చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీనిని అవమానంగా భావిస్తున్నానని.. అంగీకరిస్తున్నానని కూడా ధర్మాన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ధర్మాన వేరే ఆలోచనతో ఉన్నారా? అన్న ప్రశ్న వినిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version