Delhi World Most Polluted Capital: దేశంలో కాలుష్యం కోరలు చాస్తోంది. అత్యంత కాలుష్య నగరాలుగా భారతదేశంలోని ప్రముఖ నగరాలు రికార్డుల మోత మోగిస్తున్నాయి. నానాటికి వాతావరణ కాలుష్యాన్ని తనలో నింపుకుంటూ మనుషుల మనుగడకు ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయి. దీంతో మనుషులు వివిధ జబ్బుల బారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. వాతావరణ కాలుష్య నగరాల్లో ప్రపంచంలోని నగరాలలోని 50 నగరాలకు గాను 35 ఇండియాలోనే ఉండటం తెలిసిందే. దీంతో స్విస్ సంస్థ ఐ క్యూ ఎయిర్ విడుదల చేసిన నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
2021లో ఇండియాలోని ఏ నగరం కూడా గాలి నాణ్యత ప్రమాణాలను అందుకోలేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన మార్గదర్శకాల్లో సాధారణం కంటే పది రెట్లు కాలుష్యం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే వంద అత్యంత కాలుష్య కారక నగరాల్లో 63 మన దేశంలోనే ఉన్నాయంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతోంది. అత్యంత కాలుష్య రాజధానుల్లో ఢిల్లీ తొలి స్థానంలో ఉండటం గమనార్హం. ఇది నాలుగోసారి కావడం ఆందోళన కలిగిస్తోంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా రెండో స్థానంలో నిలిచింది.
Also Read: పీకే ఫ్రీగానా? కేసీఆర్ చెప్పేది నిజమేనా?
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో రాజస్తాన్ లోని భీవాడి మొదటి స్థానంలో నిలవగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ రెండు, ఢిల్లీ నాలుగో స్థానంలో నిలిచాయి. దీంతో కాలుష్యం ఎంత మేర విస్తరిస్తుందో అర్థమవుతోంది. ఢిల్లీలో అరవింద కేజ్రీవాల్ సర్కారు కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటున్నా పరిస్థితి మాత్రం అదుపులోకి రావడం లేదు. ఫలితంగా రోజురోజుకు ఇంకా తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇలా అయితే భవిష్యత్ లో కాలుష్య భూతం మరింత జడలు విప్పే ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
చైనాలోని హోటన్ నగరం మూడో స్థానంలో నిలిచింది. కానీ ఈ జాబితాలో తొలి 15 నగరాల్లో 10 ఇండియాలోనివే కావడం ఆందోళన కలిగించే అంశమే. పాకిస్తాన్ లోని ఫైసలాబాద్, బహవల్ పూర్, పెషావర్, లాహోర్ నగరాలు కాలుష్య కారక జాబితాలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో కాలుష్యం ఇంకా కోరలు చాస్తూనే ఉంది. పరిస్థితి అదుపులోకి వస్తుందనుకుంటే చేయి దాటి పోతోంది. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
Also Read: కట్టెకాలే వరకు కాంగ్రెస్లోనే ఉంటానన్న వెంకట్రెడ్డి.. రేవంత్కు అతిపెద్ద మద్దతు