Daggubati Purandeswari: సంచలనం : జగన్, విజయసాయిరెడ్డిని లోపలేయండి.. సుప్రీంకోర్టుకు పురంధేశ్వరి

జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి నిందితుడు. జగన్ తో పాటు జైలు జీవితం కూడా అనుభవించారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే.

Written By: Dharma, Updated On : November 4, 2023 2:56 pm

Daggubati Purandeswari

Follow us on

Daggubati Purandeswari: ఏపీ రాజకీయాల్లో చిత్రవిచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. బిజెపి, వైసీపీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తుండగా.. ఆ రెండు పార్టీల నేతల మధ్య మాత్రం గట్టి ఫైట్ నడుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత పురందేశ్వరి వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. అగ్రనేతలు వైసీపీతో సన్నిహితంగా మెలుగుతున్న వేళ.. పురందేశ్వరి మాత్రం రకరకాలుగా వైసీపీ సర్కార్ పై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను విజయసాయిరెడ్డి టార్గెట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ తరుణంలో ఆ ఇద్దరి నేతల మధ్య పెద్ద ఫైట్ నడుస్తోంది. పురందేశ్వరి జగన్ సర్కార్ పై మాట్లాడుతుండగా.. విజయసాయిరెడ్డి మాత్రం పురందేశ్వరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడం విశేషం.

పురందేశ్వరి తన పదవిని అడ్డం పెట్టుకుని భారీగా అవినీతికి పాల్పడ్డారని విజయ్ సాయి రెడ్డి ఆరోపణలు చేశారు. ఎయిర్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా ఉండే సమయంలో.. ఆ విమానయాన సంస్థ అమ్మకంలో పురందేశ్వరి మధ్యవర్తిగా వ్యవహరించారని.. భారీగా ముడుపులు పొందారని ఆరోపించారు. మద్యం సిండికేట్ బ్రోకర్ల నుంచి ఆమె కుటుంబం వసూళ్లకు పాల్పడిందని ఆరోపణలు చేశారు. ఇవి సంచలనంగా మారాయి. ఈ తరుణంలో పురందేశ్వరి విజయసాయి రెడ్డి పై యుద్ధం ప్రకటించారు. సిబిఐ కేసుల్లో ఆయన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి నిందితుడు. జగన్ తో పాటు జైలు జీవితం కూడా అనుభవించారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. అయితే పదేళ్లుగా బెయిల్ పై ఉంటూ.. బెయిల్ షరతులు ఉల్లంఘిస్తూ దారుణాలు, అక్రమాలకు పాల్పడుతున్నారని.. అందుకే బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పురందేశ్వరి లేఖ రాశారు. పిటిషన్ లో కీలకమైన అంశాలను ప్రస్తావించారు. దర్యాప్తును పదేళ్లుగా విజయసాయిరెడ్డి ప్రభావితం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్కువ పదవుల్లో ఉన్నప్పుడే అక్రమాలకు పాల్పడ్డారని.. ఇప్పుడు ఎక్కువ ప్రభావితమైన పదవుల్లో ఉన్నారని.. అంతకుమించిన అవినీతి చేశారని ఫిర్యాదులో పేర్కొనడం విశేషం.

ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి విచారణ లో సిబిఐ జరుపుతున్న జాప్యంపై ఎంపీ రఘురామకృష్ణంరాజు సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం జగన్ తో పాటు ప్రతివాదులుగా ఉన్న విజయసాయిరెడ్డికి నోటీసులు అందించింది. ఇప్పుడు ఏకంగా పురందేశ్వరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం విశేషం. అయితే పూర్తి ఆధారాలతో విజయసాయిరెడ్డి అక్రమాలను పొందుపరచడం మాత్రం ప్రాధాన్యతను సంతరించుకుంది.

బెయిల్ పై బయట ఉన్న విజయసాయిరెడ్డి ఏపీలో పెద్ద ఎత్తున మద్యం స్కాంకు పాల్పడ్డారని.. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఉన్నది కూడా విజయసాయి రెడ్డి సమీప బంధువులేనని .. విజయ్ సాయి రెడ్డి బినామీల ద్వారా కొన్ని డిస్టలరీలు నిర్వహిస్తున్నారని ఆధారాలతో సహా లేఖలో పొందుపరిచారు. ఉత్తరాంధ్రకు ఇన్చార్జిగా ఉంటూ పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారని సైతం ఫిర్యాదులో పేర్కొనడం విశేషం. అధికారంతో వ్యవస్థలను నియంత్రిస్తున్నారని.. అందుకే బెయిల్ ను రద్దు చేయాలని సీఐజేను పురందేశ్వరి కోరారు.

అయితే మధ్యలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సైతం పురందేశ్వరి ప్రస్తావించడం విశేషం. ఇప్పటికే దీనిపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ హత్య కేసును తప్పుదోవ పట్టించడంలో విజయ్ సాయి రెడ్డి కీలకంగా వ్యవహరించారని.. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా అడ్డుకోవడంలో ఆయన హస్తం ఉందని.. గతంలో ఈ కేసు విషయంలో విజయసాయి మీడియాతో మాట్లాడిన వివరాలను సైతం ఫిర్యాదులో పొందుపరచడం ప్రాధాన్యతన సంతరించుకుంది. ఇలా అన్ని విధాలుగా బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్న విజయ్ సాయి రెడ్డికి తక్షణం బెయిల్ రద్దు చేయాలని పురందేశ్వరి కోరడం ప్రత్యేక వ్యూహాన్ని తెలియజేస్తోంది. విజయసాయి విషయంలో గట్టిగానే దెబ్బ కొట్టాలని పురందేశ్వరి భావిస్తుండడం విశేషం. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎలా స్పందిస్తారో చూడాలి.