Homeజాతీయ వార్తలుKcr Dalithbandu: రూ.10 లక్షలిచ్చి ఫ్రీజ్.. కేసీఆర్ దళితబంధు వ్యూహం?

Kcr Dalithbandu: రూ.10 లక్షలిచ్చి ఫ్రీజ్.. కేసీఆర్ దళితబంధు వ్యూహం?

Kcr Dalithbandu: అసలే కరోనా కాలం.. చేతిలో పైసా లేదు. ఇప్పుడే ఎన్నికలొచ్చాయి. ఉన్నదంతా ఊడ్చి హుజూరాబాద్ లో పెడుతున్నా అక్కడ టీఆర్ఎస్ కు ఊపు రావడం లేదు. అందుకే ఈటల రాజేందర్ ను ఓడించడానికి తీసుకొచ్చిన ‘దళితబంధు’పైనే తీవ్ర కసరత్తు చేస్తున్నారు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.

ఆగస్టు మొదటి వారంలో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని భువనగిరి జిల్లాలోని తన దత్తత గ్రామం వాసాలమర్రిలో ప్రారంభించారు. వాసాలమర్రిలోని మొత్తం 76 దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చొప్పున రూ. 7.60 కోట్లు విడుదల చేశాడు.

ఆగస్టు 16న హుజూరాబాద్ లో కేసీఆర్ మళ్లీ దళితబంధును లాంఛనంగా ప్రారంభించారు. హుజూరాబాద్ లోని మొత్తం 20వేల దళిత కుటుంబాలకు దళితబంధు డబ్బుల కోసం రూ.2000 కోట్లు విడుదల చేశారు. ట్విస్ట్ ఏంటంటే.. సెప్టెంబర్ మొదటి వారం వరకూ కూడా రూ.10లక్షల మొత్తం ఆ దళితుల బ్యాంకు ఖాతాల్లో జమకాలేదు. ఆ మొత్తం ఇంకా జిల్లా కలెక్టర్ల వద్దనే ఉందని సమాచారం.

దళితబంధు ప్రకటించి కొంతమందికి ఇచ్చి మరికొంతమందికి ఆపడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై నిరసన తెలిపారు. దీనిని పసిగట్టిన కేసీఆర్ వెంటనే ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున దళితులకు బదిలీ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

గడిచిన నాలుగు రోజుల్లో హుజూరాబాద్, వాసాలమర్రిలో దళిత లబ్ధిదారులకు కలెక్టర్లు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు బదిలీ చేశారు. తమ ఖాతాకు రూ10లక్షలు బదిలీ అయినట్లు ఫోన్లలో మెసేజ్ లు రావడంతో దళితులు బ్యాంకులకు పరుగులు తీశారు. వెంటనే ఆ మొత్తాన్ని తీసుకోవడానికి ప్రయత్నించారు. కానీ కలెక్టర్లు దళితులను ఖాతాలను స్తంభింపచేశారని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఊసురుమన్నారు. డబ్బు ఇవ్వడానికి నిరాకరించారు.

దళితులు వెంటనే కలెక్టర్, జిల్లా అధికారులను సంప్రదించగా.. దళితులు పెట్టుబడి పెట్టాలనుకునే ఒక వ్యాపార విభాగాన్ని ఎంచుకోవాలని.. అలా ఎంచుకోకపోతే రూ.10లక్షల మొత్తాన్ని ఇవ్వమని స్పష్టం చేశారు. వ్యాపారం అనేది ఆర్థికంగా లాభదాయకంగా ఉండాలని సూచించారు.

దీంతో చాలా మంది దళితులు ట్రాక్టర్లు, క్యాబ్ లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపారు. కానీ ప్రతి ఒక్కరూ ట్రాక్టర్లు, క్యాబ్ లను కొనుగోలు చేస్తే వ్యాపారం సాగదని.. ఇది సరికాదని.. అందరూ నష్టపోతారని కలెక్టర్లు తిరస్కరించారు.

దీంతో దళితులు తమ ఖాతాల్లో రూ10లక్షలున్నా కూడా ఆ నిధులను ఎలా తీసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version