కరోనా సెకండ్ వేవ్ ఆకాశమంత ఎత్తున వెలిగించిన చితి మంటలు ఇంకా కళ్లముందే కదలాడుతున్నాయి. మృతుల బంధువుల ఆర్తనాదాలు ఇంకా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. అయితే.. ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నాయికానీ.. వాటి తీవ్రత తగ్గుతోంది. మృతుల సంఖ్య తగ్గుతుండడంతోపాటు కేసుల సంఖ్య కూడా కరిగిపోతోంది. దేశంలో ఒక రోజు కేసులు లక్ష వద్ద నమోదవుతుండగా.. ఏపీలో 10వేల దగ్గర తచ్చాడుతున్నాయి.
రెండు వారాల కిందటి వరకూ 20 వేల కేసులు నమోదయ్యాయి. రోజూవారి మరణాలు వంద దాటేశాయి. ఫలితంగా ఎన్నోకుటుంబాలను తీరని విషాదం చుట్టు ముట్టింది. అయితే.. ప్రస్తుతం ఈ పరిస్థితి తగ్గుతుండడం జనానికి ఊరటనిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. కరోనాతో ఆసుపత్రికి వచ్చేవారి సంఖ్య వేగంగా తగ్గిపోతున్నట్టు తెలుస్తోంది.
నిన్న (శనివారం) రాష్ట్రంలోని 58 ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్ ఒక్కరు కూడా లేరన్న వార్త ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని కలిగించింది. అంతేకాదు.. మరో 80 దవాఖానాల్లో కరోనాతో చికిత్స పొందుతున్నవారు ఐదారు మందిలోపేనని సమాచారం. కొవిడ్ సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన 25 సంరక్షణ కేంద్రాల్లో ఒక్కరు కూడా లేరని తెలుస్తోంది.
ఆసుపత్రుల్లో ఐసీయూలు, వెంటిలేటర్ బెడ్లు వేలల్లోనే ఖాళీగా ఉన్నట్టు సమాచారం. ఈ సమాచారం నిజంగా వాస్తవమే అయితే.. అంతకు మించిన ఆనందం ఏమీ లేదు. పొరుగు రాష్ట్రం తెలంగాణ కన్నా రెట్టింపు కేసులు నమోదవడం ఏపీవాసులను భయాందోళనకు గురిచేసింది. ఇప్పుడు మహమ్మారి శాంతిస్తుండడంతో రాష్ట్రం ఊపిరి పీల్చుకుంటోంది.
అయితే.. థర్డ్ వేవ్ హెచ్చరికలు వినిపిస్తూనే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలని, ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలని కేంద్రంతోపాటు వైద్య నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. అందువల్ల పాలకులు ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. సెకండ్ వేవ్ సృష్టించిన విలయం నుంచి పాఠాలు నేర్చుకొని, మరోసారి మారణహోమం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాలపై ఉంది. అదే సమయంలో ప్రజలు కూడా నిర్లక్ష్యాన్ని వదిలి, నిబంధనలు అనుసరించాల్సి ఉంది. అప్పుడే.. మూడో దశ నుంచి బయటపడగలం.