ఇక, దేశం మొత్తం బలంగా విస్తరించిన వైరస్.. ప్రతీ ఐదుగురిలో ఒకరి ఒంట్లోకి చేరిపోయింది. దీంతో.. కొవిడ్ వేగం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. మార్చిలో కేవలం 5 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు.. ప్రస్తుతం 20 శాతానికి చేరడం ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో.. 17,53,569 మందికి పరీక్షలు చేయగా.. 3,46,786 మంది వైరస్ బారిన పడ్డారని తేలింది.
ఏప్రిల్ మొదలైన నాటినుంచి వైరస్ శరవేగంగా పెరుగుతూ వచ్చిందన్న విషయాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొదటి వారంలో పరీక్షించిన మొత్తం మందిలో 8.36శాతం మందికి వైరస్ సోకింది. రెండో వారంలో 11.67శాతం మందికి, మూడో వారంలో 16.69 శాతం మందికి పెరిగింది. ఇక, గడిచిని మూడు రోజుల్లోనైతే.. ఏకంగా 19.32 శాతం మంది వైరస్ బారిన పడ్డారని తేలింది.
వరుసగా నాలుగో రోజుకూడా దేశంలో కేసుల సంఖ్య మూడు లక్షలు దాటింది. నాలుగో రోజు 2,624 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే.. గంటకు 109 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మంది కేవలం ఆక్సీజన్ అందకనే తుదిశ్వాస విడవడం దారుణం. దేశంలోని చాలా రాష్ట్రాలను ఆక్సీజన్ కొరత వేధిస్తోంది. పలు ఆసుపత్రుల్లో ఆక్సీజన్ అందుబాటులో లేక.. పేషెంట్లను చేర్చుకోవడం నిలిపేసిన పరిస్థితి ఉంది.
దీంతో.. వైరస్ బాధితులు, బంధువులు తీవ్రంగా రోధిస్తున్నారు. ఢిల్లీలోని గంగారం ఆసుపత్రి వద్ద తమ బంధువుని కాపాడుకోలేక రోడ్డపై ఓ వ్యక్తి రోధిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎక్కడ చూసినా.. ఇలాంటి ఘటనలే కనిపిస్తున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితి ఎప్పుడు అదుపులోకి వస్తుందో తెలియక.. తీవ్రభయాందోళనకు గురవుతున్నారు జనం.