Homeజాతీయ వార్తలుTelangana Elections 2023: ఓట్ల లెక్కింపు నాడు రాధాకృష్ణ కొత్త పలుకేదీ?

Telangana Elections 2023: ఓట్ల లెక్కింపు నాడు రాధాకృష్ణ కొత్త పలుకేదీ?

Telangana Elections 2023: ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు. భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ హోరాహోరిగా పోట్లాడిన ఈ ఎన్నికల్లో ఎవరిని విజయం వరిస్తుందో మరి కాసేపట్లో తేలుతుంది. కాకపోతే ఇలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న సంఘటనలు జరుగుతున్నప్పుడు మిగతా పత్రికలు ఏమోగానీ ఆంధ్రజ్యోతి మాత్రం కొంచెం డిఫరెంట్ గా స్పందిస్తుంది. ఎందుకంటే దాని ఓనర్ ఒక జర్నలిస్టు కాబట్టి. సహజంగానే వేమూరి రాధాకృష్ణ కు రాజకీయాలంటే చాలా ఇంట్రెస్ట్. అందుకే చాలామందికి సలహాలు ఇస్తూ ఉంటాడు. అవసరార్థం అంట కాగుతూ ఉంటాడు. ఇది ఓపెన్ సీక్రెట్ అయినప్పటికీ.. రాధాకృష్ణ ఈ విషయంలో ఎవరికీ భయపడడు. పైగా తన పత్రికలో ప్రతి ఆదివారం ఎడిటోరియల్ పేజీలో కొత్త పలుకు పేరుతో వ్యాసాలు రాస్తూ ఉంటాడు.. అయితే ఇందులో ఉండే బ్యూటీ ఏంటంటే ఏ విషయం అయినా నిర్మొహమాటంగా చెబుతుంటాడు. ఒక్క బాబు విషయంలోనే కొంచెం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తూ ఉంటాడు.

ఈ వారం ఏది

వారం వారం వర్తమాన రాజకీయ పరిస్థితుల మీద తనకున్న పరిజ్ఞానం మేరకు రాధాకృష్ణ వ్యాసాలు రాసుకుంటూ పోతాడు.. సో ఇందులో ఎంత నిజం ఉంది, మరెంత కల్పితం ఉంది అనేది పక్కన పెడితే.. అలా రాయడం అంటే మామూలు విషయం కాదు. రాధాకృష్ణ జర్నలిజం లో ఉండే బ్యూటీ కూడా అదే.. అయితే ఈ వారం రాధాకృష్ణ కలం నుంచి కొత్త పలుకు రాలేదు. వాస్తవానికి తెలంగాణలో ఈరోజు ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీల్లో ఒకొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇలాంటప్పుడు ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు? ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కాంగ్రెస్ వైపు విజయం ఉంటుందని చెప్పినప్పటికీ ఆ పార్టీ ఎందుకు భయపడుతోంది? కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను ఎందుకు రంగంలోకి దింపింది? కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ 15 మంది కోవర్టులు ఎవరు? ఇంకా అనేక అంశాల మీద కుండ బద్దలు కొట్టినట్టు రాయాల్సిన రాధాకృష్ణ సైలెంట్ గా ఉండడం వెనుక ఏం జరిగిందనేది అంతుపట్టడం లేదు.. పైగా ఈ ఎన్నికల్లో మొన్నటిదాకా ఎగ్జిట్ పోల్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్.. సాయంత్రం తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో కెసిఆర్ 3.0 లోడెడ్ అంటూ ట్విట్ చేయడం, ఒక తుపాకీ పట్టుకొన్న ఫోటోను పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఇలాంటి విషయాలు మీద లోతుగా రాయాల్సిన రాధాకృష్ణ మౌనం పాటించడం నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తోంది.

చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు శోకాలు పెట్టి, దీర్ఘాలు తీసిన రాధాకృష్ణ.. తెలంగాణ ఎన్నికల ఫలితాల సందర్భంగా ఎటువంటి సంపాదకీయం రాయకపోవడం ఒకింత ఆశ్చర్యకరమే. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నా, అసలు విషయానికి వచ్చేసరికి ఆ పార్టీ విజయం సాధించదు అనుకున్నాడా? లేక ఈమధ్య కేసీఆర్ తో కొత్త దోస్తీ ఏమైనా కుదిరిందా? అందుకే గులాబీ పార్టీ జాకెట్ యాడ్స్ ఇస్తోందా? ఎన్నికలకు ముందు కేటీఆర్ తో చేసిన ఇంటర్వ్యూ ఉద్దేశం కూడా అదేనా? ఇన్ని ప్రశ్నలు జర్నలిజం సర్కిల్లో మెదులుతున్నాయి. ఈ వాదనలు గాలికి పోయే పేలపిండివి కొంతమంది కొట్టి పారేస్తుండవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంత జరుగుతున్నప్పుడు రాధాకృష్ణ ఎటువంటి వ్యాసం రాయకపోవడం పై అనుమానాలకు ఎందుకు బలం చేకూర్చదు? అన్నట్టు ఇదే రాధాకృష్ణ ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి అంబాసిడర్ గా వ్యవహరించారు. కొద్ది రోజులు బిజెపి అనుకూల వార్తలు రాశారు. కొంతకాలానికి చంద్రబాబు కాంగ్రెస్ కూటమిలో చేరడంతో యూ టర్న్ తీసుకున్నారు. అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీకి కొంచెం సపోర్ట్ గానే ఉన్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి తో కూడా ఇంటర్వ్యూ చేశారు. ప్రభుత్వం మీద వ్యతిరేక వార్తలు రాయలేదు గానీ.. కాంగ్రెస్ పార్టీకి మాత్రం అండగానే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్నాయి అని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాధాకృష్ణ హఠాత్తుగా మౌనం దాల్చడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version