దేశంలో కరోనా కల్లోలం

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. పాజిటివ్ కేసులు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. రోజురోజుకు వేలసంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. కరోనా బారిన పడి అనేక రాష్ట్రాలు, నగరాలు అల్లకల్లోలానికి గురవుతున్నాయి. లాక్ డౌన్లో కొనసాగుతున్నాయి. కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. దేశంలో రోజూవారి కరోనా కేసులు లక్షమార్క్ ను వారంరోజలు వ్యవధిలోనే అధిగమించడం దాని తీవ్రతను తెలియజేస్తోంది. ఇదే వేగం కొనసాగితే.. రోజూ రెండు లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యే ప్రమాదం ఉందని […]

Written By: Srinivas, Updated On : April 12, 2021 2:10 pm
Follow us on

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. పాజిటివ్ కేసులు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. రోజురోజుకు వేలసంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. కరోనా బారిన పడి అనేక రాష్ట్రాలు, నగరాలు అల్లకల్లోలానికి గురవుతున్నాయి. లాక్ డౌన్లో కొనసాగుతున్నాయి. కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. దేశంలో రోజూవారి కరోనా కేసులు లక్షమార్క్ ను వారంరోజలు వ్యవధిలోనే అధిగమించడం దాని తీవ్రతను తెలియజేస్తోంది. ఇదే వేగం కొనసాగితే.. రోజూ రెండు లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యే ప్రమాదం ఉందని వైద్యాధికారులు అంటున్నారు.

దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,68,912 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 904మంది మరణించారు. లక్షన్నరకు పైగా రోజువారీ కేసులు నమోదు కావడం వరుసగా ఇది రెండోసారి. ఆదివారం నాడు 1,52,879 కేసులు రికార్డు కాగా.. 24 గంటలు గడిచేసరికి ఈ సంఖ్య భారీగా పెరిగింది. కరోనా వైరస్ ఆరంభమైన తరువాత ఈ ఏడాదికాలంలో ఎప్పుడూ ఈ స్థాయిలో కొత్త కేసులు వెలుగులోకి రాలేదు. సెకెండ్ వేవ్‌లో ప్రభావం దేశంపై పెద్ద ఎత్తున పడుతోంది. మరణాల్లోనూ అదే తరహా స్పీడ్ కనిపించడం ఆందోళనకు దారి తీస్తోంది.

కొత్తగా 75,086 మంది ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,35,27,717కు చేరుకుంది. ఇందులో 1,21,56,529 మంది డిశ్చార్జ్ కాగా.. 1,70,179 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 12,01,009కి చేరింది. దేశంలో 12 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు నమోదు కావడం కూడా ఇదే తొలిసారి. ఇదివరకు గరిష్ఠంగా 11 లక్షల కేసులే ఉండేవి. మరణాల సంఖ్య కూడా అదే వేగంతో పెరుగుతోంది. మృతుల సంఖ్య లక్షా 70 వేలను దాటడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 10,45,28,565 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 45 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందజేయాలనే నిబంధన పట్ల పలు రాష్ట్రాలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి ఈ నిబంధననను ఎత్తేయాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. ఢిల్లీలో కరోనా వైరస్ బారిన పడుతున్న వారిలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపు వారేనని కేజ్రీవాల్ ప్రభుత్వం చెబుతోంది.

కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటిదాకా 25,78,06,986 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 11,80,136 టెస్టింగులను చేపట్టినట్లు తెలిపింది. దేశంలో నమోదవుతోన్న రోజువారీ కరోనా కొత్త కేసుల్లో మహారాష్ట్ర వాటా అధికంగా ఉంటోంది. సగం కేసులు అక్కడే నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో సెకెండ్ వేవ్‌లో కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఆదివారం నాటి బులెటిన్ ప్రకారం ఒక్కరోజే 63,000కు పైగా కేసులు నమోదయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్రలో వీకెండ్ లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం.